రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో యశస్వి జైస్వాల్.. విరాట్ కోహ్లీ తరహాలో పరిణతిని కనబర్చాడని కొనియాడాడు. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. జెమీ ఓవర్టన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 43) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/19), నండ్రే బర్గర్(2/19), రవీంద్ర జడేజా(2/18) రెండేసి వికెట్లు తీయగా.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 128 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కంబోజ్ ఒక్కడే 2 వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుండగా.. ఆకాశ్ చోప్రా మాత్రం యశస్వి జైస్వాల్ను కొనియాడాడు.
మరో ఎండ్లో తన సహచర ఆటగాడు హిట్టింగ్ చేస్తున్నా.. యశస్వి జైస్వాల్ తన వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి జట్టు కోసం నిలబడ్డాడని తెలిపాడు. అతని బ్యాటింగ్ విరాట్ కోహ్లీని తలపించిందని అభిప్రాయపడ్డాడు. 'యశస్వి జైస్వాల్ ఎంతో పరిణతిని ప్రదర్శించాడు. మరో ఎండ్ నుంచి సహచర ఆటగాడు హిట్టింగ్ చేస్తున్నా.. తను మాత్రం నిలకడగా ఆడాడు. అతని బ్యాటింగ్ విరాట్ కోహ్లీని తలపించింది. జట్టు ప్రయోజనాల కోసం వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టి.. అవతలి బ్యాటర్తో పోటీ పడకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం.
జట్టు గెలవాలి.. అవసరమైతే నాటౌట్గా నిలిచి మ్యాచ్ ముగించాలి. మీ పేరు పక్కన స్టార్ గుర్తు ఉందంటే మీరు అజేయంగా నిలిచారని అర్థం. ఎవరైతే తమ పేరు పక్కన ఎక్కువసార్లు ఆ స్టార్ గుర్తును కలిగి ఉంటారో.. ముఖ్యంగా రన్ చేజ్ సమయంలో నాటౌట్గా నిలుస్తారో.. వారే సూపర్ స్టార్ అవుతారు. యశస్వి జైస్వాల్ ఆటను చాలా జాగ్రత్తగా నడిపించాడు. అతని బ్యాటింగ్ నిజంగా అద్భుతం.'అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.