టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న చాహల్.. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడు. గతేడాదే నార్తాంప్టన్ షైర్ తరఫున కౌంటీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన చాహల్.. 4 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. అయినా అతనికి టీమిండియా పిలుపు దక్కలేదు. ప్రస్తుతం భారత జట్టు ఆల్రౌండర్లపై ఫోకస్ పెట్టడంతో చాహల్కు జట్టులో చోటు లేకుండా పోయింది.
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ చాహల్ కొనసాగుతున్నాడు. భారత్ తరఫున 72 వన్డేలు ఆడి 121 వికెట్లు తీసాడు. 86 టీ20ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్గా చాహల్ నిలవగా.. అతని రికార్డ్ను ఇటీవలే అర్ష్దీప్ సింగ్ అధిగమించాడు. ఒకప్పుడు భారత జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగిన 34 ఏళ్ల చాహల్.. ఏడాదిన్నరగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కోసం సిద్దమవుతున్న చాహల్.. ఈ టోర్నీ ముగిసిన వెంటనే కౌంటీ క్రికెట్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు.

'గత సీజన్లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడటం నాకు సంతోషాన్నిచ్చింది. ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టులోకి మళ్లీ తిరిగి వెళ్లడం సంతోషంగా ఉంది. గతేడాది సీజన్ చివర్లో మేం గొప్ప క్రికెట్ ఆడాం. ఈసారి కూడా గొప్ప ప్రదర్శన చేస్తాం.'అని చాహల్ తెలిపాడు.
చాహల్పై నార్తాంప్టన్ షైర్ కోచ్ డారెన్ లెహ్మన్ ప్రశంసల జల్లు కురిపించారు. 'ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అయిన చాహల్ మా జట్టులోకి రావడం మాకు సంతోషంగా ఉంది. అతనికి అపారమైన అనుభవం ఉంది. జూన్ నుంచి ప్రారంభమయ్యే అప్కమింగ్ సీజన్లో అతను మాతో కలిసి ఆడనున్నాడు.'అని డారెన్ లెహ్మన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో చాహల్.. పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. వేలంలో అతన్ని పంజాబ్ 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ ముగిసిన వెంటనే కౌంటీ క్రికెట్ కోసం చాహల్.. ఇంగ్లండ్కు రానున్నాడు. అదే సమయంలో భారత జట్టు ఐదు టెస్ట్ల కోసం ఇంగ్లండ్లో పర్యటించనున్నాడు.