ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఘోర తప్పిదం చేశాడు. గల్లీ క్రికెట్ తరహాలో బ్లండర్ మిస్టేక్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. క్రికెట్ బేసిక్ రూల్స్ను హార్దిక్ పాండ్యా మరిచిపోయాడు. నిబంధనలకు విరుద్దంగా ఆన్సైడ్లో ఐదుగురికి మించి ఫీల్డర్లు ఉండకూడదు. కానీ విల్జాక్స్ వేసిన ఐదో ఓవర్లో హార్దిక్ పాండ్యా ఆఫ్ సైడ్ కేవలం ముగ్గురు ఫీలర్లను మాత్రమే పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన అంపైర్.. రూల్స్ ప్రకారం నోబాల్గా ప్రకటించి ముంబై ఇండియన్స్కు పెనాల్టీ విధించాడు. ఈ నోబాల్ను విలిజాక్స్ వేయగా.. విప్రజ్ నిగమ్ ఎదుర్కొన్నాడు.
హార్దిక్ పాండ్యా సిల్లీ మిస్టేక్పై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్గా ఇంత ఘోర తప్పిదం ఎలా చేశావని, వికెట్ కీపర్ ఏం చేస్తున్నాడని మండిపడుతున్నారు. చూసుకోవాలి కదా బ్రో అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 39), విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/11), జస్ప్రీత్ బుమ్రా(3/12) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసారు.