సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) రివేంజ్ తీర్చుకుందా? సంప్రదాయనికి భిన్నంగా స్లో వికెట్ తయారు చేసిన సన్రైజర్స్ను దెబ్బకొట్టిందా? అంటే సోషల్ మీడియా వేదికగా అవుననే సమాధానం వినిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ కోసం తయారు చేసిన స్లో వికెట్ను చూసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు, కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ స్లో వికెట్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కమిన్స్.. పిచ్ హైదరాబాద్ సంప్రదాయ వికెట్కు భిన్నంగా ఉందని చెప్పాడు. వికెట్ ఇంత స్లోగా ఉంటుందని తాము అస్సలు ఊహించలేదన్నాడు.

స్లో వికెట్పై కమిన్స్ అసహనం..
'ఇది ఏమాత్రం హైదరాబాద్ సంప్రదాయ వికెట్ కాదు. బ్యాటింగ్కు చాలా కష్టంగా మారింది. దాంతో మ్యాచ్పై పట్టు సాధించలేకపోయాం. మేం ఆశించినంత స్పిన్ కూడా లభించలేదు. మేం కొన్ని పరుగులు తక్కువ చేశాం. గుజరాత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. డ్యూ కూడా ప్రభావం చూపింది.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ థార్ రోడ్డు లాంటి బ్యాటింగ్ ట్రాక్లను సిద్దం చేసే హెచ్సీఏ ఒక్కసారిగా స్లో వికెట్ సిద్దం చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే హెచ్సీఏ స్లో వికెట్ తయారు చేసి సన్రైజర్స్ హైదరాబాద్పై రివేంజ్ తీర్చుకుందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
ఫ్రీ పాసుల కోసం గొడవ..
ఐపీఎల్ 2025 సీజన్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్సీఏ, సన్రైజర్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్రీ పాసుల విషయంలో హెచ్సీఏ తమను బెదిరిస్తుందని, ఇబ్బంది పెడుతుందని సన్రైజర్స్ యాజమాన్యం ఆరోపిస్తూ హెచ్సీఏ మెయిల్ చేయడం.. అది బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని విజిలెన్స్ విచారణకు ఆదేశించేంత వరకు ఈ గొడవ వెళ్లింది. హెచ్సీఏ సెక్రటరీ దేవ్రాజ్ సమక్షంలో సన్రైజర్స్తో చర్చలు జరిపిన హెచ్సీఏ.. ఈ గొడవకు ముగింపు పలికింది.
హోమ్ అడ్వాంటేజ్ ఎక్కడ..?
నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన 3900 కాంప్లిమెంటరీ పాసులను తీసుకునేందుకు అంగీకరించింది. గొడవ సద్దుమణిగిందని సన్రైజర్స్-హెచ్సీఏ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. కానీ ఈ గొడవ తర్వాత ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లోనే స్లో వికెట్ తయారు చేయడం.. సన్రైజర్స్ ఓడిపోవడంతో ఈ వాగ్వాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సన్రైజర్స్ ప్రధాన బలం బ్యాటింగ్. అలాంటిది ఆ జట్టును దెబ్బతీసేలా స్లో వికెట్ ఎలా తయారు చేస్తారని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సన్రైజర్స్కు హోమ్ అడ్వాంటేజ్ లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. సన్రైజర్స్ ఆరోపణల నేపథ్యంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు.. మ్యాచ్ల నిర్వహణకు దూరంగా ఉంటున్నారు. అయినా.. హెచ్సీఏపై విమర్శలు ఆగడం లేదు.