టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ఎక్కడా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో వివాదాస్పద వ్యాఖ్యానంతో తరుచు వార్తల్లో నిలిచిన రాయుడు.. ఐపీఎల్ రీస్టార్ట్ తర్వాత కామెంట్రీ ప్యానెల్లో కనిపించడం లేదు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఐపీఎల్ 2025 సీజన్ను బీసీసీఐ వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కన్నుకు కన్ను అంటే..
అయితే ఆపరేషన్ సిందూర్.. ఆ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఉద్దేశించి రాయుడు చేసి ట్వీట్పై తీవ్ర దుమారం రేపింది. 'కన్నుకు కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది'అనే మహాత్మగాంధీ కొటేషన్ను రాయుడు ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సాయుధ దళాలను తప్పుబట్టేలా ఈ ట్వీట్ ఉందని రాయుడిని ఏకిపారేసారు. తన తప్పును తెలుసుకున్న రాయుడు వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చాడు. కానీ నెటిజన్లు మాత్రం శాంతించలేదు. అతనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. ముఖ్యంగా అవకాశం ఎదురు చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్.. జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేశారు.

అంబటి రాయుడిపై వేటు.?
ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడటంతో ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్ కాగా.. ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్లో అంబటి రాయుడు కనిపించలేదు. రాయుడిపై బీసీసీఐ చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. రాయుడు మాత్రం కామెంట్రీకి దూరంగా ఉన్నాడు. బీసీసీఐ లేదా బ్రాడ్కాస్టర్ తీసుకున్న నిర్ణయమా? స్వయంగా రాయుడు తీసుకున్న నిర్ణయమా? అనేదానిపై స్పష్టత లేదు.
సీఎస్కేకు మద్దతుగా..
రాయుడి తన కామెంట్రీలో చెన్నై సూపర్ కింగ్స్, ధోనీ పట్ల పక్షపాతం చూపించేవాడు. ఈ విషయాన్ని అతను బహిరంగంగానే అంగీకరించాడు. ముఖ్యంగా ఆర్సీబీ జట్టును తక్కువ చేసేలా మాట్లాడి ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ను రెచ్చగొట్టేవాడు. అతని వ్యాఖ్యానంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిష్పక్షపాతంగా వ్యాఖ్యానం చేయాలనే నిబంధనల ఉన్నందున నేపథ్యంలో రాయుడిని నుంచి కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించి ఉండవచ్చని, లేదా దూరంగా ఉండమని చెప్పవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయుడు కూడా తన గైర్హాజరీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎక్స్ వేదికగా కోహ్లీ రిటైర్మెంట్పై చివరి పోస్ట్ చేశాడు.
ఆర్సీబీ ఫైనల్ చేరిన నేపథ్యంలో రాయుడు ఎక్కడా? అంటూ ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ టైటిల్ గెలవదని రాయుడు జోస్యం చెప్పాడు. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నా.. రాయుడిని ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.