ఐపీఎల్ 2025 సీజన్లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో కృనాల్ పాండ్యా రఫ్ఫాడిస్తే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ సత్తా చాటారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 44) దూకుడుగా ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా(3/29), జోష్ హజెల్ వుడ్(2/22) కేకేఆర్ పతనాన్ని శాసించారు.

అనంతరం ఆర్సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్), ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్, నరైన్, అభినవ్ మనోహర్ తలో వికెట్ తీసారు.
టర్నింగ్ పాయింట్ అదే..
కేకేఆర్ మిడిలార్డర్ వైఫల్యం ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్. కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ ధాటికి కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రహానే, నరైన్ విధ్వంసకర బ్యాటింగ్తో 107/1 స్కోర్తో నిలిచిన కేకేఆర్ 200 ప్లస్ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ కృనాల్ పాండ్యా సంచలన బౌలింగ్తో అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్(6), రింకూ సింగ్(12)లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. డేంజరస్ ఆండ్రీ రస్సెల్ను సుయాశ్ శర్మ ఔట్ చేయడంతో 100/1తో పటిష్టంగా ఉన్న కేకేఆర్.. వరుసగా వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. చివరి 6 ఓవరల్లో ఆ జట్టు 31 పరుగులే చేసింది. కృనాల్ బౌలింగ్ ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.