ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది. ముంబై ఇండియన్స్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన సూపర్ ఓవర్ థ్రిల్లర్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. ఈ సీజన్లో ఇదే తొలి సూపర్ ఓవర్ మ్యాచ్. ఐపీఎల్లో నాలుగేళ్ల తర్వాత సూపర్ ఓవర్ జరిగింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 49), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్), అక్షర్ పటేల్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/32) రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ(1/40), వానిందు హసరంగా(1/38) చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51), నితీష్ రాణా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్(1/23), కుల్దీప్ యాదవ్(1/33), మిచెల్ స్టార్క్(1/36) తలో వికెట్ తీసారు.
సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగులకే ఆలౌటైంది(సూపర్ ఓవర్లో 2 వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్లు). రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ రనౌట్ అయ్యారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు బంతుల్లో 2, 4, 1, 6 బాది విజయం సాధించింది.
మలుపు తిప్పిన స్టార్క్..
ఈ మ్యాచ్లో తొలి రెండు ఓవర్లలో ధారళంగా పరుగిలిచ్చిన స్టార్క్.. చివర్ స్పెల్లో మాత్రం నిప్పులు చెరిగాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో క్రీజులో సెట్ అయిన నితీష్ రాణాను ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఈ ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చిన అతను ఆఖరి ఓవర్లో 9 పరుగులు ఇవ్వకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కచ్చితమైన యార్కర్లతో మ్యాచ్ను టైగా మార్చాడు. సూపర్ ఓవర్లోనూ యార్కర్లతో రాజస్థాన్ బ్యాటర్లను ఒత్తిడికి గురి చేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు. స్టార్క్ వేసిన మూడు ఓవర్లు(సూపర్ ఓవర్తో) ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచాయి.