ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చేపట్టిన రిటెన్షన్ ప్రక్రియ ముగింపుకు చేరింది. గురువారం(అక్టోబర్ 31)తో రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు ముగియనుంది. అదే రోజు సాయంత్ర 5 గంటలకు 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో సినిమాలు వెల్లడించనున్నాయి.
ఈ రిటెన్షన్ ప్రక్రియలో ప్రతీ జట్టు ఆరుగురి ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం బీసీసీఐ కల్పించింది. ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం లేదా వేలంలో రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డ్ కింద ఆరుగురిని తిరిగి కొనుగోలు చేసే వెసులు బాటు కల్పించింది. అయితే ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలని చెప్పింది.

అశ్విన్ వ్యాఖ్యలతో..
ఐపీఎల్ 2018 మెగా వేలంలో చివరిసారిగా ఆర్టీఎమ్ కార్డ్ను ఉపయోగించారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ రూల్ను పక్కనపెట్టాడు. మళ్లీ తాజాగా ప్రవేశపెట్టారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్టీఎమ్ కార్డ్ను పక్కనపెట్టిన బీసీసీఐ.. ఈసారి మాత్రం అనుమతిచ్చింది.
అయితే ఈ రూల్ కారణంగా ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారనే అశ్విన్ వ్యాఖ్యల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిబంధనను కాస్త మార్చింది. ఆటగాళ్లకు లాభం చేకూర్చేలా ఆర్టీఎమ్ రూల్ను ట్విస్ట్ చేసింది.
రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) అంటే ఏమిటీ..?
మెగా వేలానికి వదిలేసిన తమ ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీలు ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే గతంలో ఈ రూల్ ప్రకారం.. ప్రత్యర్థి ఫ్రాంచైజీ బిడ్ వేసిన ధరను చెల్లించి జట్టులోకి తీసుకునేది. కానీ ఈ సారి బీసీసీఐ ఈ రూల్ను మార్చింది. బిడ్ వేసిన టీమ్కు సదరు ప్లేయర్ను తీసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. మరోసారి బిడ్ వేసే వెసులుబాటు కల్పించింది. అప్పుడు ఆ ఆ ధరను చెల్లిస్తేనే ఆర్టీఎమ్ కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.
ఉదాహరణకు సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ట్రావిస్ హెడ్ను ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. వేలంలో ఆర్సీబీ అతని కోసం రూ. 12 కోట్ల వరకు బిడ్ వేసి దక్కించుకుంది. అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ ఆర్టీఎమ్ కార్డుతో ట్రావిస్ హెడ్ను తీసుకోవాలనుకుంది. పాత రూల్ ప్రకారం రూ. 12 కోట్లు చెల్లించి తీసుకోవచ్చు. కానీ బీసీసీఐ నయా రూల్ ప్రకారం ఆర్సీబీ మరోసారి బిడ్ వేయవచ్చు. అప్పుడు ఆర్సీబీ 13 కోట్లకు బిడ్ వేస్తే.. సన్రైజర్స్ ఆ డబ్బులను చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ట్రావిస్ హెడ్ ఆర్సీబీకి దక్కుతాడు.