గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని కొనియాడాడు. భారత సెలెక్టర్లతో పాటు ఆర్సీబీ మేనేజ్మెంట్పై సిరాజ్ తన ఆటతోనే ప్రతీకారం తీర్చుకున్నాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆర్సీబీతో బుధవారం జరిగిన మ్యాచ్లో సిరాజ్(3/19) మూడు వికెట్లతో గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై నిప్పులు చెరిగాడు. పవర్ ప్లేలోనే ఆర్సీబీని దెబ్బతీసాడు. 7 ఏళ్ల పాటు సిరాజ్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు సిరాజ్ను ఆర్సీబీ వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్లో విఫలమైన సిరాజ్.. ముంబై ఇండియన్స్తో పాటు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగాడు.

తాజాగా సిరాజ్ ప్రదర్శనపై మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం.. ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంతో సిరాజ్ బాగా హర్ట్ అయ్యాడని చెప్పాడు. 'చిన్నస్వామి మైదానంలో సిరాజ్ కొత్త బంతితో తన రికార్డ్ను కొనసాగించాడు. తొలి 3 ఓవర్లలో అతను 12 లేదా 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదే సమయంలో అతను నాలుగో ఓవర్ బౌలింగ్ చేసినా.. మరిన్ని వికెట్లు దక్కేవి. అతను బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. పిచ్ నుంచి కూడా సిరాజ్కు సహకారం లభించింది.
అతనిలో మంచి ఫైర్ ఉంది. సిరాజ్ బాగా హర్ట్ అయినట్లు అర్థమవుతోంది. ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదనే మంట అతనిలో కనిపించింది. ఓ యువ బౌలర్ నుంచి మేం కోరుకునేది ఇదే. 'మీరు నన్ను సెలెక్ట్ చేయరా? నేనేందో చూపిస్తా'అనే అటిట్యూడ్ ఉండాలి. సిరాజ్ ఇదే జోరును కొనసాగించి టీమిండియాలోకి పునరాగమనం చేయాలని కోరుకుంటున్నా.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.