రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నయా సారథి రజత్ పటీదార్పై ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. రజత్ పటీదార్ ప్రతిభావంతమైన కుర్రాడని కొనియాడాడు. ఆర్సీబీ భవిష్యత్తు అతనేనని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ ముంగిట ఆర్సీబీ.. తమ నూతన సారథిగా యువ ప్లేయర్ అయిన రజత్ పటీదార్ను నియమించిన విషయం తెలిసిందే.
అప్కమింగ్ సీజన్ నేపథ్యంలో ఆర్సీబీ సోమవారం.. చిన్నస్వామి స్టేడియంలో అన్బాక్స్ ఈవెంట్ నిర్వహించింది. అప్కమింగ్ సీజన్తో పాటు టీమ్ కాంబినేషన్ గురించి కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే రజత్ పటీదార్ను కొనియాడుతూ.. అతనికి మద్దతుగా నిలవాలని ఫ్యాన్స్ను కోరాడు.

ప్రతిభావంతమైన ఆటగాడు..
'రజత్ పాటిదార్ ఓ అద్భుతమైన ఆటగాడు. అతనిపై కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. ఆర్సీబీని విజయవంతంగా నడిపించడమే కాకుండా అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత ఉంది. ఈ ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న ఆశల్ని అతను తప్పక నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. తప్పకుండా ఆర్సీబీని గెలుపు బాటలో నడిపిస్తాడు. సారథిగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, ప్రతిభ అతనిలో ఉన్నాయి.'అని విరాట్ కోహ్లీ తెలిపాడు.
అన్సోల్డ్గా నిలిచి
ఐపీఎల్ 2021లో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేసిన రజత్ పటీదార్.. 4 మ్యాచ్లు ఆడి 71 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ తర్వాతి సీజన్కే అతన్ని వేలంలోకి వదిలేసింది. ఐపీఎల్ 2022 వేలంలో అతన్ని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. దాంతో అన్సోల్డ్గా నిలిచాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట ఆర్సీబీ తీసుకున్న అనామక ప్లేయర్ లవ్నీత్ సిసోడియా గాయపడటంతో అతని స్థానంలో అనూహ్యంగా రజత్ పటీదార్ జట్టులోకి వచ్చాడు.
ఆ సెంచరీతో మారిన రజత్ ఫేట్ ..
ప్రాక్టీస్ మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనికి ఆర్సీబీ మేనేజ్మెంట్ తుది జట్టులో చోటిచ్చింది. రూ. 20 లక్షల కనీస ధరతోనే జట్టులోకి వచ్చిన అతను ఆ సీజన్లో 8 మ్యాచ్ల్లో 55.50 సగటుతో 333 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం సాధించాడు. అది కూడా లక్నో సూపర్ జెయింట్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో 54 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో సెంచరీ చేసిన తొలి అనామక ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ పటీదార్ తలరాతను మార్చేసింది. కానీ గాయం కారణంగా తర్వాతి ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
రూ. 20 లక్షల నుంచి రూ. 11 కోట్లకు
అతనిపై నమ్మకం ఉంచిన ఆర్సీబీ అండగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్లో రీఎంట్రీ ఇచ్చిన అతను 15 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 395 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఆర్సీబీ అతన్ని రూ. 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్ను వదిలేయడంతో తమ సారథిగా రజత్ పటీదార్ను నియమించింది.
గాయపడిన ఆటగాడికి రిప్లేస్మెంట్గా రూ. 20 లక్షల కనీస ధరతో జట్టులోకి వచ్చిన రజత్ పటీదార్.. మెరుగైన ప్రదర్శనతో రూ. 11 కోట్ల ధరను అందుకోవడంతో పాటు ఇప్పుడు ఏకంగా ఆర్సీబీ సింహాసనంపైనే కూర్చున్నాడు.