రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్పై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలోనే రజత్ పటీదార్ కెప్టెన్సీని తప్పుబడుతూ గట్టిగా అరిచేసాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 163 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 37), టీమ్ డేవిడ్(20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 37 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. విప్రజ్ నిగమ్(2/18) ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్.. కేఎల్ రాహుల్(53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 93 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో 17.5 ఓవర్లలో 169 పరుగులు చేసి గెలుపొందింది.

అయితే ఈ మ్యాచ్లో రజత్ పటీదార్ సరైన ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేయడం లేదని కోహ్లీ అరిచేసాడు. అతని సలహాలను పట్టించుకోకుండా ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేసి ఓటమికి కారణమయ్యాడని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ స్వల్ప లక్ష్యమే నమోదు చేసినా.. బౌలర్లు శుభారంభం అందించడం.. పిచ్ స్లోగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. 14 ఓవర్లలో 99 పరుగులే చేసింది. ఢిల్లీ విజయానికి చివరి 36 బంతుల్లో 65 పరుగులు అవసరమయ్యాయి.
హజెల్ వుడ్ వేసిన 15వ ఓవర్లో కేఎల్ రాహుల్ 4, 4, 2, 2, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. దాంతో మ్యాచ్ మూమెంటమ్ మారిపోయింది. ఈ ఓవర్ తర్వాత కోహ్లీ రజత్ పటీదార్పై గట్టిగా అరిచాడు. ఇదేం ఫీల్డ్ సెటప్ అని మండిపడ్డాడు. టీమ్ మెంటార్ దినేశ్ కార్తీక్తో కూడా రజత్ పటీదార్ కెప్టెన్సీ తప్పిదాలను ప్రస్తావించాడు. మ్యాచ్ అనంతరం రజత్ పటీదార్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా కోహ్లీ నిరాకరించాడు.
కోహ్లీ మద్దతుతోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రజత్ పటీదార్.. అతన్నే పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రజత్ పటీదార్ కెప్టెన్సీపై వేటు వేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఓటమితో ఆర్సీబీ జట్టులో విభేదాలు బయటపడ్డాయని కామెంట్ చేస్తున్నారు.