ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో వెక్కిరించాడు. కేఎల్ రాహుల్ కాంతార సెలెబ్రేషన్స్ను గుర్తు చేస్తూ మరి ట్రోల్ చేశాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. కోహ్లీ చర్యతో కేఎల్ రాహుల్ ముఖం మాడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అసలేం జరిగిందంటే..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఫైటింగ్ నాక్ ఆడాడు. ఈ విజయానంతరం రాహుల్ ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. కాంతార సినిమాలో ఓ సీన్ను రీక్రియేట్ చేస్తూ.. 'ఇది(చిన్నస్వామి స్టేడియం) నా అడ్డా.. ఇక్కడ ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు'అన్నట్లు సైగలు చేశాడు. కోహ్లీ, ఆర్సీబీని ఉద్దేశించే రాహుల్ ఈ సంబరాలు చేసుకున్నాడని అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కోహ్లీ రివేంజ్..
ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ప్రతికారం తీర్చుకుంది. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడిన విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే విజయం ముంగిట భారీ షాట్ ఆడే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో కోహ్లీ రివేంజ్ సెలెబ్రేషన్స్ మిస్సయ్యామని ఫ్యాన్స్ భావించారు. కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం.. రాహుల్ దగ్గరకు వెళ్లిన కోహ్లీ.. కాంతార సెలెబ్రేషన్స్ను గుర్తు చేస్తూ మరి అతన్ని ఎగతాళి చేశాడు.
కోహ్లీ చర్యకు బిత్తరపోయిన రాహుల్.. ఫ్యాన్స్కు చెప్పాలని సూచించాడు. ఆ తర్వాత రాహుల్ను కోహ్లీ హగ్ చేసుకోగా.. పక్కనే ఉన్న దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ పడి పడి నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కృనాల్ ఆల్రౌండ్ షో..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(41), ట్రిస్టన్ స్టబ్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యాకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. కృనాల్ పాండ్యా(73 నాటౌట్), విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 119 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. చమీర ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.