ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిద్దమవుతోంది. ఇప్పటికే రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఓ అవగాహనకు వచ్చిన ఆర్సీబీ.. మెగా వేలంలో అనుసరించాల్సిన ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ నేతృత్వంలోని ఆర్సీబీ.. అప్కమింగ్ సీజన్ కోసం అన్ని విధాల సమాయత్తమవుతోంది.
మరోవైపు బీసీసీఐ కూడా మెగా వేలం నిర్వహించడంపై ఫోకస్ పెట్టింది. రిటెన్షన్ పాలసీని రూపొందించే పనిలో నిమగ్నమైన బీసీసీఐ.. ఇప్పటికే 10 ఫ్రాంచైజీల సలహాలు, సూచనలను స్వీకరించింది. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. మెగా వేలం రూల్స్ ప్రకారం గరిష్టంగా నాలుగు నుంచి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది.

డుప్లెసిస్కు గుడ్బై..!
అయితే మెగా వేలానికి ముందు ఆర్సీబీకి కొత్త కెప్టెన్ను ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది. విరాట్ కోహ్లీ తర్వాత ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన ఫాఫ్ డుప్లెసిస్ను మళ్లీ రిటైన్ చేసుకునే అవకాశం లేదు. మరో మూడేళ్ల వరకు మెగా వేలం జరగదు. ఈ పరిస్థితుల్లో 40 ఏళ్ల వయసున్న ఫాఫ్ డుప్లెసిస్ను రిటైన్ చేసుకొని ఆర్సీబీ రిస్క్ చేయలేదు.
ఒకవేళ రిటైన్ చేసుకున్న అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. వేలంలో ఓ భారత స్టార్ ప్లేయర్ను కొనుగోలు చేసి అతన్ని సారథిగా ఎంపిక చేయాలనేది ఆర్సీబీ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా ఉన్న కేఎల్ రాహుల్లను ఆర్సీబీ టార్గెట్ చేసినట్లు సమాచారం.
కెప్టెన్గా కోహ్లీ..?
వీరందరి కంటే.. విరాట్ కోహ్లీకి మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించి.. తద్వారా జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేస్తే బాగుంటుందని ఫ్రాంచైజీ ఓనర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు విరాట్ కోహ్లీ సుముఖంగా లేకున్నా.. అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్సీబీ వర్గాలు పేర్కొన్నాయి.
జట్టు కోసం ఏదైనా చేసేందుకు విరాట్ కోహ్లీ రెడీగా ఉంటాడు. ఆ కోణంలోనే విరాట్ కోహ్లీని మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ మళ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపడితే ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దే ఉండదు. ఇప్పటికే అభిమానులు.. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోహ్లీని కోరుతున్నారు.
ప్రస్తుతం లండన్లో ఉన్న విరాట్ కోహ్లీ.. విశ్రాంతి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే రెండు టెస్ట్ల సిరీస్తో మళ్లీ కోహ్లీ బ్యాట్ పట్టనున్నాడు.