ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఎట్టకేలకు తమ హోమ్ గ్రౌండ్లో తొలి విజయాన్నందుకుంది. మూడు వరుస పరాజయాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో గెలుపు జెండా ఎగురవేసింది. రాజస్థాన్ రాయల్స్తో గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో జోష్ హజెల్ వుడ్(4/33) అసాధారణ బౌలింగ్తో ఆర్సీబీ ఓటమిని తప్పించుకుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ.. పరుగెత్తుకొచ్చి హజెల్ వుడ్ను ఎత్తుకున్నాడు. అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆనందం వచ్చినా.. కోపం వచ్చినా కోహ్లీ తట్టుకోలేడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సరిగ్గా ఆడని ఆటగాళ్ల పట్ల ఎంత కఠినంగా ఉంటాడో.. మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్లను అదే స్థాయిలో ప్రశంసిస్తాడని అభిప్రాయపడుతున్నారు. తన స్థాయిని మరిచి కూడా ఆటగాళ్లను అభినందిస్తాడని కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 70), దేవదత్ పడిక్కల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 47) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించగా.. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి.
19వ ఓవర్లో హజెల్ వుడ్ మ్యాచ్ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. క్రీజులో సెట్ అయిన ధ్రువ్ జురెల్తో పాటు వానిందు హసరంగాలను ఔట్ చేసి ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దాంతో ఆర్సీబీకి విజయం దక్కింది. ఈ ఓవర్లో ధ్రువ్ జురెల్ ఔటవ్వకపోయినా.. హజెల్ వుడ్ 8 ప్లస్ రన్స్ ఇచ్చినా ఫలితం మరోలా ఉండేది.