ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో ఓటమి ఎదురైంది. అదేం చిత్రమో.. ఈ సీజన్లో బయటి వేదికలపై దుమ్ము రేపుతున్నఆర్సీబీ.. సొంతగడ్డపై మాత్రం చతికిలపడుతోంది. రెండు వరుస విజయాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆడిన తొలి మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ.. గత మ్యాచ్లో వాంఖడే వేదికగా ముంబైపై సంచలన విజయాన్నందుకుంది. కానీ మళ్లీ సొంత మైదానంలో తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.
బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిన వికెట్పై ఆర్సీబీ మిడిలార్డర్ చేతులెత్తేయడం ఆ జట్టు ఓటమికి కారణమైంది. అయితే టీమ్ డేవిడ్ విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీకి 163 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. వికెట్ స్లోగా ఉండటం.. ఛేజింగ్లో ఢిల్లీ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం మ్యాచ్ను ఉత్కంఠగా మార్చింది. ఆర్సీబీ గెలుస్తుందనిపించింది. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. దాంతో ఢిల్లీ 14 ఓవర్లలో 99 పరుగులే చేసింది. ఢిల్లీ విజయానికి చివరి 36 బంతుల్లో 65 పరుగులు అవసరమయ్యాయి.

పిచ్ స్లోగా ఉండటంతో ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని భావించారు. అదే సమయంలో మైదానంలో చిరు జల్లులు కూడా పడ్డాయి. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆర్సీబీకే విజయవకాశాలు ఉన్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో 15వ ఓవర్ వేసిన హజెల్ వుడ్.. చెత్త బౌలింగ్తో ఆర్సీబీ కొంపముంచాడు.
చిరు జల్లులు పడటంతో.. డక్వర్త్ లూయిస్ లెక్కలను దృష్టిలో పెట్టుకున్న రాహుల్ దూకుడుగా ఆడాడు. డీఎల్ఎస్ ప్రకారం ఢిల్లీ గెలవాలంటే 15 ఓవర్లకు 115/4 పరుగులు చేయాలి. దాంతో హజెల్ వుడ్ వేసిన 15వ ఓవర్లో 4, 4, 2, 2, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. అప్పటి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ఈ ఒక్క ఓవర్తో ఢిల్లీ వైపు మళ్లింది. గేమ్ మూమెంటమ్ పూర్తిగా మారిపోయింది.
ఆర్సీబీని గట్టెక్కిస్తాడని భావించిన హజెల్ వుడ్.. 23 పరుగులిచ్చి ఓటమికి కారణమయ్యాడు. ఈ సమయంలో సుయాశ్ శర్మతో బౌలింగ్ చేయించకుండా.. హజెల్ వుడ్ను బౌలింగ్ తీసుకురావడాన్ని విరాట్ కోహ్లీ తప్పుబట్టాడు. బౌండరీ లైన్ వద్ద దినేశ్ కార్తీక్తో మాట్లాడుతూ.. రజత్ పటీదార్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశాడు. ఫీల్డ్ సెటప్ కూడా సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. హజెల్ వుడ్ ఈ ఒక్క ఓవర్ కట్టడిగా వేసుంటే ఫలితం మరోలా ఉండేదని ఆర్సీబీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.