రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ నూతన సారథిగా టీమిండియా యువ బ్యాటర్ రజత్ పటీదార్ను ఎంపిక చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీని రజత్ పటీదార్ నడిపిస్తాడని బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపడుతాడని ప్రచారం జరిగినా.. మళ్లీ సారథిగా కొనసాగేందుకు అతను సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దాంతోనే రజత్ పటీదార్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ అనంతరం ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు సీజన్లలో అతనే జట్టును నడిపించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ.. ఫాఫ్ డుప్లెసిస్ను రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు. దాంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఆర్సీబీకి ఏర్పడింది.

జట్టులో కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ ఆటగాళ్లున్నా.. ఆర్సీబీ మేనేజ్మెంట్ రజత్ పాటిదార్కే సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీలోకి వచ్చిన రజత్ పాటిదార్ ఇప్పటి వరకు 27 మ్యాచ్లు ఆడి 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. గత సీజన్లో 15 మ్యాచ్ల్లో ఐదు హాఫ్ సెంచరీలతో 395 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్కు సారథిగా వ్యవహరిస్తున్న రజత్ పటీదార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 10 మ్యాచ్ల్లో 428 పరుగులు చేశాడు.
రజత్ పటీదార్ను కెప్టెన్గా ఎంపిక చేయడాన్ని విరాట్ కోహ్లీ సమర్థించాడు. గత కొన్నేళ్లుగా రజత్ పటీదార్ ఆటగాడిగా ఎంతో మెరుగయ్యాడని చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టును రజత్ పటీదార్ అద్భుతంగా నడిపించాడని, ఆర్సీబీని నడిపించే నైపుణ్యం అతనికి ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
'గత రెండు-మూడేళ్లుగా రజత్ పటీదార్ ఆటగాడిగా ఎంతో మెరుగయ్యాడు. భారత్ తరఫున ఆడే అవకాశం కూడా అతనికి వచ్చింది. అన్ని లెవెల్స్లో అతని ఆట కూడా ఎంతో మెరుగైంది. తన రాష్ట్ర జట్టును రజత్ పటీదార్ నడిపించిన విధానం..కెప్టెన్గా అతను తీసుకున్న బాధ్యత ఫ్రాంచైజీ జట్టును నడిపించడానికి కావాల్సిన నైపుణ్యం ఉందనే విషయాన్ని తెలియజేస్తోంది.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.