ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ వరుణ్ ఆరోన్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా ఓ వ్యాక్సిన్ లాంటోడని, బౌలింగ్లో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తాడని కొనియాడాడు. ఐపీఎల్ 2025 సీజన్లో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బుమ్రా సంచలన బౌలింగ్తో ముంబై ఇండియన్స్ను గెలిపించాడు. అసాధారణ యార్కర్తో వాషింగ్టన్ సుందర్ను ఔట్ చేసి మ్యాచ్ను మలుపుతిప్పాడు. ఈ విజయంతో క్వాలిఫయర్-2కు అర్హత సాధించిన ముంబై.. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో బుమ్రా గురించి మాట్లాడిన వరుణ్ ఆరోన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బుమ్రా ఒక విరుగుడు ఔషదం లాంటివాడు. బౌలింగ్ జట్టుకు వచ్చే ఎలాంటి రోగాన్ని అయినా నయం చేయగల వ్యాక్సిన్ లాంటివాడు. వికెట్లు కావాల్సినప్పుడు వికెట్లు తీస్తాడు. పరుగులు నియంత్రించాలన్నప్పుడు రన్స్ అడ్డుకుంటాడు. అసాధారణమైన మనిషి, బౌలర్.

తన సామర్థ్యంపై బుమ్రాకు ఉన్న నమ్మకం ఎంతంటే.. మ్యాచ్ చేజారిపోతుందని భయపడుతున్న ఓ అంతర్జాతీయ కోచ్కు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చేంత. గుజరాత్తో మ్యాచ్లో ఈ విషయం స్పష్టమైంది. ముంబై బౌలర్లు ధారళంగా పరుగులిస్తుండటంతో జయవర్ధనే ఆందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో బుమ్రా.. 'నేను ఉన్నాను.. ప్రశాంతంగా ఉండండి'అని చెప్పాడు. చెప్పినట్లే వచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు.'అని వరుణ్ ఆరోన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్లో బుమ్రా 11 ఇన్నింగ్స్ల్లో 6.36 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఎంట్రీతోనే ముంబై విజయాల బాట పట్టింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లోనూ బుమ్రా కీలకం కానున్నాడు.