రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు, ఐపీఎల్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వీడియో ధోనీ ఫ్యాన్స్, సీఎస్కే అభిమానులను ఆకట్టుకుంటుంది. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ వైభవ్ సూర్యవంశీ.. తొలి బంతినే సిక్సర్గా మలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో గత శనివారం జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడటంతో అతని స్థానంలో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్యవంశీ.. విధ్వంసకర బ్యాటింగ్తో అందర్నీ ఆకట్టుకున్నాడు.

20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 34 పరుగులు చేసిన ఈ బిహార్ కుర్రాడు.. స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఔటైన అనంతరం ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. 14 ఏళ్ల వయసే అయినా.. తన ఆటలో ఎంతో మెచ్యూరిటీ చూపించాడు. ఈ ప్రదర్శనతో ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది నేషన్గా నిలిచాడు. అతని ఆటకు యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అయ్యింది.
అయితే వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా దిగ్గజ కెప్టెన్, సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ కాళ్లు మొక్కిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ గత మార్చి 30న గౌహతి వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో వైభ్ సూర్యవంశీ.. ధోనీ ఆశీర్వాదం తీసుకున్నాడు.
ధోనీ దగ్గరకు రాగా వంగి కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయగా.. ధోనీ వారించాడు. అప్పటికీ వైభవ్ సూర్యవంశీ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో ఈ ఘటనను ఎవరూ గుర్తించలేదు. తాజాగా అతను అరంగేట్రంలోనే అదరగొట్టడంతో.. ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.