రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు, ఐపీఎల్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ కన్నీటి పర్యంతమయ్యాడు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ బిహార్ కుర్రాడు.. తొలి బంతినే సిక్సర్గా మలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఫియర్లెస్ గేమ్తో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా స్పిన్నర్లు, పేసర్లను అలవోకగా ఆడేసాడు. చాలా ఆత్మవిశ్వాసంగా కనిపించిన ఈ కుర్రాడు.. చూడముచ్చటైన షాట్లతో ప్రేక్షకులను కనువిందు చేశాడు.
మంచి రిథమ్తో బ్యాటింగ్ చేసిన సూర్యవంశీ అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డ్ సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది. ఎయిడెన్ మార్క్రమ్ బౌలింగ్లో లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్యవంశీ బ్యాలెన్స్ కోల్పోయి స్టంప్ ఔట్ అయ్యాడు. అయితే హాఫ్ సెంచరీ సాధించలేదన్న బాధో.. లేక జట్టుకు కావాల్సిన పరుగులు చేయాలేదనే చింతనో.. అతని పసితనమో తెలియదు కానీ.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు.

పెవిలియన్ చేరుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సన్నివేశం క్రికెట్ ప్రేమికుల మనసులను నొచ్చుకునేలా చేసింది. పాపం బుడ్డోడు.. ఔటవ్వాల్సింది కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
'ఐసీసీ టోర్నీల్లో కప్పు కొట్టలేనప్పుడూ, ఫైనల్కు చేరకుండా సెమీ ఫైనల్లో ఓడినప్పుడు స్టార్ క్రికెటర్లు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. కానీ అక్కడలేనిదీ ఇక్కడ ఉన్నదీ పసితనం. ముక్కుపచ్చలారనితనం. నూనూగు కూడా మొలవనితనం. సూర్యవంశీ..ముందు ముందు నీకోసం చాలా మంది ఏడుస్తారు. ముందు ముందు నిన్ను చూసి చాలా మంది ఏడుస్తారు.'అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
जब भी इसका मज़ाक उड़ाने की भावना जोर से लगे,
— Gaurav Pratap (@gauravprat) April 19, 2025
बस याद करना, “तुम क्या कर रहे थे जब चौदह के थे?”@RajsthanRoyals@LucknowIPL #VaibhavSuryavanshi pic.twitter.com/QoGJUeZvaO
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 66), ఆయుష్ బదోని(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో వానిందు హసరంగా(2/31) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 74), వైభవ్ సూర్యవంశీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34), రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/37) మూడు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించగా.. శార్దూల్ ఠాకూర్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు.