భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్.. ఐపీఎల్ 2025 సీజన్ మ్యాచ్ల నిర్వహణపై ప్రభావం చూపనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జమ్మూ కశ్మీర్లో గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత త్రివిధ దళాలు మంగళవారం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
1971 తర్వాత భారత త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇదే కావడం విశేషం. పహల్గాంలో భారత స్త్రీల సింధూరాన్ని నేల రాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సింధూర్'అని ఈ దాడికి నామకరణం చేశారు. అయితే ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాదీ దేశాల మధ్య యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ రద్దు..?
ఈ పరిస్థితులు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణపై ప్రభావం చూపుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే యాథావిధిగా కొనసాగుతుందని, ఆపరేషన్ సింధూర్ ప్రభావం మ్యాచ్లపై పడదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండే ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా ఉండే 18 విమానాశ్రయాలను భారత ప్రభుత్వం తాత్కలికంగా మూసి వేసింది. ఇందులో ధర్మశాలతో పాటు ఛండీఘడ్, అమృత్ సర్, జమ్మూ, శ్రీనగర్ కూడా ఉన్నాయి.
ధర్మశాల విమానాశ్రయం మూసివేత
పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ధర్మశాల మైదానం రెండో హౌమ్ గ్రౌండ్గా ఉంది. ఇప్పటికే ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది. మరో రెండు మ్యాచ్లు జరగాల్సి ఉంది. మే8న పంజాబ్-ఢిల్లీ, మే 11న పంజాబ్-ముంబై మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంది. ధర్మశాల విమానాశ్రయం మూసివేత నేపథ్యంలో ఆటగాళ్ల ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. ఆటగాళ్లు రోడ్డు మార్గం ద్వారా ధర్మశాల చేరినా.. బ్రాడ్కాస్టర్ సిబ్బంది, టీవీ క్రూ, ఇక్విప్మెంట్ తరలింపు సమస్యగా మారనుంది.
గురువారం జరిగే మ్యాచ్ కోసం పంజాబ్, ఢిల్లీ జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి. రేపటి మ్యాచ్ జరగుతుందా? లేక వాయిదా వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. లేదా ఈ రెండు మ్యాచ్లను వాయిదా వేసి ఇతర వేదికల్లో నిర్వహిస్తారా? అనేది చూడాలి. ఈ మ్యాచ్ సెక్యూరిటీ కూడా సమస్యగా మారనుంది. ఈ రెండు మ్యాచ్లపై బీసీసీఐ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ల ఫలితాలు ప్లే ఆఫ్స్ రేసును ప్రభావితం చేయనున్నాయి. మూడు జట్లకు ఈ రెండు మ్యాచ్లు జరగడం కీలకం.