ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్.. గత మూడు సీజన్లలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. రెండు సార్లు ఏకంగా పాయింట్స్ టేబుల్లో అట్టడుగుస్థానంలో నిలిచింది.
ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట కెప్టెన్ను మారుస్తూ ఆ జట్టు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను ముంబై తమ సారథిగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఆ జట్టు అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టు కూడా రెండుగా విడిపోయిందనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై దారుణంగా విఫలమైంది.

వచ్చే ఏడాది ఐపీఎల్కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే టీమ్ బలోపేతంపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ.. కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. కానీ గరిష్టంగా నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ టాప్ ఆటగాళ్లను వదులుకునే అవకాశం ఉంది. గతేడాది కెప్టెన్సీ విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ముగ్గురు టాప్ ఆటగాళ్లు జట్టును వీడనున్నారు.
1. గెరాల్డ్ కోయిట్జీ..
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో 8 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీసిన గెరాల్డ్ కోయిట్జీని ముంబై ఇండియన్స్ రూ. 5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అందకు తగ్గట్లుగానే కోయిట్జీ కూడా ముంబై తరఫున సత్తా చాటాడు. 10 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసాడు. అయితే మెగా వేలం నేపథ్యంలో నలుగురు-ఐదుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉండటంతో.. గెరాల్డ్ కోయిట్జీ వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ముంబై ఇండియన్స్ కోర్ టీమ్ను రిటైన్ చేసుకోనుంది. జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లను అంటిపెట్టుకోనుంది. కోయిట్జీతో పాటు టీమ్ డేవిడ్, దిల్షాన్ మదుషంక వంటి ఆటగాళ్లకు కూడా ఉద్వాసన పలకనుంది. అయితే ఆర్టీఎమ్ కార్డ్ను కోయిట్జీ ఉపయోగించే అవకాశం లేకపోలేదు.
2. నెహాల్ వదేరా..
ముంబై ఇండియన్స్ తరఫున నెహాల్ వదేరా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ముంబై తరఫున 20 మ్యాచ్లాడి 350 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2023లో కాస్త తడబడిన నెహాల్ వదేరా.. ఐపీఎల్ 2024లో మాత్రం సత్తా చాటాడు. అతన్ని వదులుకోవాలని ముంబైకి లేకున్నా.. మెగా వేలం కారణంగా రిలీజ్ చేయకుండా ఉండలేని పరిస్థితి. రిటైన్షన్ ప్రక్రియలో ఒకరు అనామక ప్లేయర్ ఉండాలనే రూల్ పెడితే మాత్రం.. నెహాల్ వదేరా జట్టులో కొనసాగుతాడు. అతను ఇంకా భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు.
3. రోహిత్ శర్మ..
ముంబై ఇండియన్స్ సెక్సెస్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మను కూడా ఆ జట్టు వదులుకునే అవకాశం ఉంది. కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అతను అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతను బహిరంగంగా మాట్లాడకపోయినా.. రోహిత్ సతీమణి రితికా సజ్దే సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. రోహిత్ కూడా తన సన్నిహితులతో ముంబై జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడని వార్తలు వచ్చాయి. ఐపీఎల్లోనూ కెప్టెన్గానే కొనసాగాలని భావిస్తున్న రోహిత్ శర్మకు ఇతర జట్ల నుంచి చాలా ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.