ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించే దిశగా సాగుతోంది. అందని ద్రాక్షగా మిగిలిని ఐపీఎల్ టైటిల్ను అందుకునేందుకు ఆర్సీబీ రెండు అడుగుల దూరంలో నిలిచింది. 14 లీగ్ మ్యాచ్ల్లో 9 విజయాలతో పాటు ఓ మ్యాచ్ రద్దవ్వడంతో మొత్తం 19 పాయింట్స్తో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ తరహాలోనే 19 పాయింట్స్ సాధించిన పంజాబ్ కింగ్స్ మెరుగైన రన్రేట్తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మరికొద్ది సేపట్లో ముల్లాన్పూర్ వేదికగా జరిగే క్వాలిఫయర్-1లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కనుంది.

సెకండ్ ప్లేస్ టీమ్కు 8 టైటిళ్లు..
అయితే ఈ సీజన్లో ఆర్సీబీనే టైటిల్ వరిస్తుందని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టోర్నీ చరిత్ర, లెక్కలు కూడా ఆర్సీబీకి అనుకూలంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ 2011 సీజన్ నుంచి గతేడాది వరకు నెంబర్2లో నిలిచిన జట్లే అత్యధిక సార్లు విజేతగా నిలిచాయి. మొత్తం 8 సార్లు రెండో ప్లేస్లో నిలిచి టీమ్స్ టైటిల్ గెలవగా.. తొలి స్థానంలో నిలిచిన జట్టు ఐదు సార్లు టైటిల్ అందుకున్నాయి. మూడో స్థానంలో నిలిచిన జట్టు ఒక సారి విజేతగా నిలిచింది. ఈ రికార్డ్స్ను ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీ టైటిల్ లోడింగ్..
2011, 2012, 2013, 2014, 2015, 2018, 2021, 2023 సీజన్లలో రెండో స్థానంలో నిలిచిన జట్లు టైటిల్ అందుకున్నాయి. 2017, 2019, 2020, 2022, 2024 సీజన్లలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ఛాంపియన్గా నిలిచాయి. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ గణంకాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఆర్సీటీ టైటిల్ లోడింగ్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. చివరిసారిగా ఆర్సీబీ ఫైనల్ చేసిన ఐపీఎల్ 2016లోనూ ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలోనే నిలిచింది. కానీ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. ఈ సారి మాత్రం ఆ తప్పిదం చేయకుండా టైటిల్ ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
సువర్ణవకాశం..
గతంలో కంటే జట్టు సమతూకంగా ఉండటం.. ఆటగాళ్లంతా ఫామ్లో ఉండటం ఆర్సీబీకి కలిసొచ్చే అశం. గతంలో కోహ్లీ ఒక్కడిపైనే ఆర్సీబీ ఆధారపడేది. కానీ ఈ సారి కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, టీమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఈ క్రమంలోనే టైటిల్ గెలిచేందుకు ఆర్సీబీకి ఇదే మంచి అవకాశమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.