ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు హైదరాబాద్కు చేరుకుంది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను చూసేందుకు ఫ్యాన్స్ భారీ ఎత్తున ఎగబడ్డారు. ముంబైకి రాజా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. హైదరాబాద్లో రోహిత్ శర్మ క్రేజ్ మాములుగా లేదు కదా? అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
గతంతో రోహిత్ వర్మ డెక్కన్ ఛార్జర్స్కు ప్రాతినిథ్యం వహించాడు. దాంతో అతనికి హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఒకవేళ డెక్కన్ ఛార్జర్స్ జట్టు కొనసాగి ఉంటే అతను ఆ జట్టు సారథిగా కొనసాగేవాడు. ఈ విషయాన్ని డెక్కన్ ఛార్జర్స్ విన్నింగ్ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నగరానికి వచ్చిన ముంబై ఇండియన్స్ టీమ్కు హైదరాబాద్ పోలీసులు భారీ భద్రత కల్పించారు.

బుధవారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. గత మ్యాచ్లో ముంబై చేతిలోనే ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్.. ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. అచ్చొచ్చిన హోమ్ గ్రౌండ్లో ముంబైని మట్టికరిపించి మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.
మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. అదే ఆధిపత్యం కొనసాగించాలనుకుంటోంది. రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం.. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఉప్పల్ వికెట్పై మ్యాచ్ జరగనుండటంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్దమవుతోంది.