DC vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా 48వ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలక మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేయగలిగింది. అంగ్క్రిష్ రఘువంశీ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ జట్టులో డుప్లెసిస్(62), కెప్టెన్ అక్షర్ పటేల్(43) రాణించారు. చివరలో విప్రజ్ నిగమ్(38) పోరాడినా ఫలితం లేకపోయింది. కోల్కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టారు. అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఓటమి తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ చాలా నిరాశకు గురయ్యాడు.
IPL 2025: ఢిల్లీ కొంపముంచిన నరైన్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం!
మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితి, పవర్ ప్లేలో ఢిల్లీ బౌలింగ్ ను పరిగణనలోకి తీసుకుంటే తాము 15 నుంచి 20 పరుగులు ఎక్కువగా ఇచ్చామని చెప్పాడు. కొన్ని వికెట్లను కూడా సులభంగా కోల్పోయినట్లు అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే పవర్ ప్లే తర్వాత కోల్ కతా బ్యాటర్లను బాగా ఆపామని చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే.. కొంతమంది బ్యాటర్లు పరుగులు సాధించలేకపోయినప్పటికీ ఇద్దరి నుంచి ముగ్గురు ఆటగాళ్లు బాగా సహకరించారని అక్షర్ పటేల్ తెలిపాడు.మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగిందని.. విప్రజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆశ ఉండేదన్నాడు. అశుతోష్ కూడా అక్కడ ఉండి ఉంటే బహుశా ఢిల్లీ మొదటి మ్యాచ్ లాగా అద్భుతాలు చేసి ఉండేదన్నాడు. తన గాయం గురించి అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ప్రాక్టీస్ సమయంలో డైవింగ్ చేయడం వల్ల తన చర్మంపై గాయాలైనట్లు చెప్పాడు. కానీ 3-4 రోజులు విరామం ఉందని.. అప్పటివరకు తాను బాగానే ఉంటానని ఆశిస్తున్నట్లు అక్షర్ పటేల్ అన్నాడు.