ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డ్ రూల్ను మళ్లీ ప్రవేశపెట్టింది. ఆర్టీఎమ్ కార్డుతో కలిపి ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతిచ్చింది.
అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతీ జట్టు పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 31లోను రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలను ఆదేశించింది.

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్టీఎమ్ కార్డ్ను పక్కనపెట్టిన బీసీసీఐ.. ఈసారి ఆ రూల్ కాస్త మార్చి తీసుకొచ్చింది. అయితే ఈ నయా ఆర్టీఎమ్ రూల్పై ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నయా రూల్పై పునరాలోచన చేయాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) నయా రూల్ ఏంటంటే..?
మెగా వేలానికి వదిలేసిన తమ ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీలు ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా ఒకరిని తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే గతంలో ఈ రూల్ ప్రకారం.. ప్రత్యర్థి ఫ్రాంచైజీ బిడ్ వేసిన ధరను చెల్లించి జట్టులోకి తీసుకునేది. కానీ ఈ సారి బీసీసీఐ ఈ రూల్ను మార్చింది. బిడ్ వేసిన టీమ్కు సదరు ప్లేయర్ను తీసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. మరోసారి బిడ్ వేసే వెసులుబాటు కల్పించింది. అప్పుడు ఆ ఆ ధరను చెల్లిస్తేనే ఆర్టీఎమ్ కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.
ఉదాహరణకు సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ట్రావిస్ హెడ్ను ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. వేలంలో ఆర్సీబీ అతని కోసం రూ. 12 కోట్ల వరకు బిడ్ వేసి దక్కించుకుంది. అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ ఆర్టీఎమ్ కార్డుతో ట్రావిస్ హెడ్ను తీసుకోవాలనుకుంది. పాత రూల్ ప్రకారం రూ. 12 కోట్లు చెల్లించి తీసుకోవచ్చు. కానీ బీసీసీఐ నయా రూల్ ప్రకారం ఆర్సీబీ మరోసారి బిడ్ వేయవచ్చు. అప్పుడు ఆర్సీబీ 13 కోట్లకు బిడ్ వేస్తే.. సన్రైజర్స్ ఆ డబ్బులను చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ట్రావిస్ హెడ్ ఆర్సీబీకి దక్కుతాడు.
ఫ్రాంచైజీల అసంతృప్తి..
ఆర్టీఎమ్ నయా రూల్పై ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీఎమ్ ప్రాథమిక ఉద్దేశానికి విరుద్దంగా ఈ నయా రూల్ ఉందని, ఆటగాడి అసలు విలువ తెలుసుకోకుండా చేస్తుందని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపాడు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా ఆటగాడి ప్రైజ్ను పెంచడానికి ఆస్కారం ఇస్తుందన్నాడు. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ నయా ఆర్టీఎమ్ రూల్.. జట్లు ఉపయోగించకుండా వేలంలో పోటీ పెంచేందుకు తెచ్చినట్లుగా ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.