ఐపీఎల్ 2025 వాయిదాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఫ్రాంచైజీల విజ్ఞప్తులు, ఆటగాళ్ల ఆందోళనల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. భారత సాయుధ బలగాలకు బీసీసీఐ అండగా నిలుస్తుందని, వారి ధైర్య సాహాసాలకు సెల్యూట్ చేస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శుక్రవారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
'ఫ్రాంచైజీల నుంచి వచ్చిన విజ్ఞప్తులు.. వారి ఆటగాళ్ల ఆందోళనలను పరిగణలోకి తీసుకొని ఐపీఎల్ 2025 సీజన్ను వారం పాటు వాయిదా వేస్తున్నాం. అలాగే బ్రాడ్కాస్టర్, స్పాన్సర్స్తో పాటు ఐపీఎల్ వాటాదారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత సాయుధ దళాల బలం, సంసిద్దతపై బీసీసీఐ పూర్తి విశ్వాసం ఉంచినప్పటికీ.. బోర్డు వాటాదారుల సమష్టి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగడం మంచిదని భావించాం.

ఈ కఠిన సమయంలో దేశానికి బీసీసీఐ అండగా నిలుస్తుంది. భారత ప్రభుత్వంతో పాటు సాయుధ దళాలు, దేశ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత సాయుధ దళాల దైర్య సాహాసాలు, నిస్వార్థ సేవకు బీసీసీఐ సెల్యూట్ చేస్తోంది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు జరిపిన దాడులు.. పాకిస్థాన్ సాయుద దళాల దుస్సాహసాన్ని తిప్పికొట్టిన తీరును బీసీసీఐ కొనియాడుతోంది. భారత సైన్యం తమ చర్యలతో స్పూర్తి దాయకంగా నిలుస్తోంది.'అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వరుసగా రెండు ట్వీట్స్ చేసింది.
ఈ తర్వాత ఈ విషయాలనే ప్రస్తావిస్తూ.. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఓ ప్రకటనను విడుదల చేశారు. సంబంధిత అధికారులు, వాటాదారులతో సంప్రదించి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసిన తర్వాత, ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపారు. క్రికెట్ జాతీయ అభిరుచిగా ఉన్నప్పటికీ.. దేశ భద్రత కంటే ఎక్కువ కాదని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కంటే బీసీసీఐకి ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన బీసీసీఐ ముఖ్య వాటాదారులు అయినా అధికారిక బ్రాడ్ కాస్టర్ జియో హాట్ స్టార్, టైటిల్ స్పాన్సర్ టాటా, అసోసియేట్ భాగస్వాములకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారం రోజుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు సద్దుమణిగితే.. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది.