ఐపీఎల్ 2025 సీజన్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 73 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.

తడబడిన ముంబై..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు శుభారంభం దక్కలేదు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన మూడో ఓవర్లోనే రోహిత్ శర్మ(5) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్తో కలిసి దూకుడుగా ఆడాడు. అయితే జాక్స్(21)ను ముఖేష్ కుమార్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ 2 వికెట్లకు 54 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం ర్యాన్ రికెల్టన్(25)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 55 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని ముఖేష్ కుమార్ విడదీసాడు.
కొంపముంచిన ముఖేష్ కుమార్..
తిలక్ వర్మ(27)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా(3) కూడా నిరాశపర్చడంతో 123 పరుగులకే ముంబై 5 వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. నమన్ ధీర్తో సాయంతో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ముఖేష్ కుమార్ వేసిన 19వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ భారీ సిక్సర్ బాదగా.. నమన్ ధీర్ 4, 6, 6, 4 బాది 27 పరుగులు పిండుకున్నాడు. దుష్మంత్ చమీరా వేసిన ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్లు బాది 21 పరుగులు పిండుకున్నాడు. ఈ రెండు ఓవర్లతో మూమెంటమ్ ముంబై వైపు మళ్లింది.