ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీరుపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చెత్త బ్యాటింగ్తో చేజేతులా చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఆఖరి ఓవర్కు ముందు తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్గా బయటకి పంపించడం వివాదాస్పదమైంది.
ఇంపాక్ట్ ప్లేయర్గా ఐదో స్థానంలోకి బరిలోకి దిగిన తిలక్ వర్మ.. 23 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 25 పరుగులే చేశాడు. జిడ్డు బ్యాటింగ్తో ముంబై ఓటమికి కారణమయ్యాడు. బంతిని కనెక్ట్ చేయడానికి తిలక్ వర్మ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆఖరి ఓవర్లో ముంబై ఇండియన్స్ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్గా బయటకు వచ్చేసాడు.

కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూచనలతోనే అతను మైదానం వీడినట్లు అనిపించింది. ఆ సమయంలో డగౌట్లో కూర్చున్న సూరీడు.. ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్ మహేళ జయవర్ధనేను నిలదీసాడు. జయవర్దనే వివరణ ఇచ్చినా.. సూర్య సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై సూర్యకుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నాడు. గతేడాది రోహిత్ శర్మకు మద్దతుగా అతను ట్వీట్ కూడా చేశాడు. వరుస పరాజయాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్కు అప్పగించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 60), ఎయిడెన్ మార్క్రమ్(38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా(5/36) ఐదు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, అశ్వని కుమార్, విజ్ఞేష్ పుతుర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసి ఓటమిపాలైంది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 67), నమన్ ధిర్(24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 46) రాణించారు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ రతీ తలో వికెట్ తీసారు.