బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తమకు అలవాటైన రీతిలోనే మరోసారి తొలి మ్యాచ్ను దేవుడికి ఇచ్చేసింది. గత 13 ఏళ్లుగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో శుభారంభం అందుకోలేదు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. బ్యాటింగ్లో 15-20 పరుగులు తక్కువగా చేసామని తెలిపాడు. 'ఈ మ్యాచ్లో మేం 15-20 పరుగులు తక్కువగా చేశాం. కానీ మా కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారు. విజ్ఞేష్ ప్రదర్శన అద్భుతం. ప్రతిభ కలిగిన కుర్రాళ్లను పరిచయం చేయడం ముంబై ఇండియన్స్కే అలవాటే. ముంబై స్కౌట్స్ 10 నెలల కష్టానికి ప్రతిఫలం విజ్ఞేష్.

గేమ్ చివరి వరకు వెళ్తుందని అతని ఒక ఓవర్ ఆపాను. కానీ 18వ ఓవర్లో అతనికి బౌలింగ్ ఇవ్వడం సరికాదనిపించింది. డ్యూ లేదు కానీ పిచ్ స్టిక్కీగా ఉంది. రుతురాజ్ అసాధారణ బ్యాటింగ్.. మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఇది సుదీర్ఘ టోర్నీ. బలంగా పుంజుకుంటాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29), తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31)టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో దీపక్ చాహర్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్(4/14) నాలుగు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్(3/29) మూడు వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్కు చెరో వికెట్ దక్కింది.
అనంతరం సీఎస్కే 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 53), రచిన్ రవీంద్ర(44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విజ్ఞేష్ పుతుర్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.