ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్కు టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు దక్కగా.. హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పించారు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనుండటంతో ముంబై ఇండియన్స్ కూడా మంచి జట్టును ఎంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. రిటెన్షన్ చేసుకోవాల్సిన ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే తమ టాలెంట్ స్కౌట్స్తో ప్రతిభ కలిగిన ఆటగాళ్ల కోసం అన్వేషిస్తోంది.

మెగా వేలం రూల్స్ ప్రకారం నలుగురు నుంచి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. ఐపీఎల్ మెగా వేలం నిర్వహణపై ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రిటెన్షన్ పాలసీని రూపొందించడంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే ఫ్రాంచైజీలతో రిటెన్షన్ పాలసీ గురించి చర్చలు కూడా జరిపింది. ఈ సమావేశంలో 7-8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ముంబై ఇండియన్స్ కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ముంబై ఇండియన్స్ జట్టును మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వీడుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను తమ నయా సారథిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ముంబై ఇండియన్స్ జట్టులో విబేధాలు తలెత్తాయి. హార్దిక్ పాండ్యాకు సీనియర్లు ఎవరూ సహకరించలేదు. కెప్టెన్సీ మార్పుపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లు ఆ జట్టు రిటెన్షన్కు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
బుజ్జగింపు చర్యలకు దిగిన ముంబై ఇండియన్స్..సూర్యకు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైనట్లు సమాచారం. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. అయితే రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉండటంతో టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కనీసం సూర్య సారథ్యంలోనైనా జట్టు పూర్వ వైభవాన్ని అందుకుంటుందా? లేదా అనేది చూడాలి.