ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరడంపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 59 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చివరి మ్యాచ్ గెలిచినా.. ముంబైని అధిగమించే పరిస్థితి లేకపోవడంతో ఢిల్లీ ఇంటిబాట పట్టింది.
ఈ మ్యాచ్లోనూ తడబడిన ముంబై ఇండియన్స్.. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 73 నాటౌట్), నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) సంచలన బ్యాటింగ్కు తోడుగా.. మిచెల్ సాంట్నర్(3/11), జస్ప్రీత్ బుమ్రా(3/12) నిప్పులు చెరగడంతో సునాయస విజయాన్నందుకుంది. అజేయ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

ఈ సందర్భంగా మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. ఈ అవార్డ్ను తన సతీమణి దేవిషా శెట్టికి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్ల్లో ఇతర అవార్డ్స్ అందుకున్న తాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలవలేదని, ఈ విషయాన్ని తన సతీమణి గుర్తు చేసిందని చెప్పాడు.
'ఈ సీజన్లో ఇది 13వ మ్యాచ్. ఈ మ్యాచ్కు ముందు నా భార్య ఓ స్వీట్ స్టోరీ చెప్పింది. ఈ సీజన్లో నాకు అన్ని అవార్డులు వచ్చాయని, కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదని గుర్తు చేసింది. ఈ రోజు ఆ అవార్డ్ దక్కడం చాలా ప్రత్యేకం. జట్టు దృష్ట్యా.. ఈరోజు నేను ఆడిన ఇన్నింగ్స్ చాలా ముఖ్యమైనది. ఈ ట్రోఫీ నా భార్యకు అంకితం. నేను చివరి వరకు ఆడటం ముఖ్యం. నా సతీమణి ఇలాంటి క్షణాల కోసం ఎదురు చూస్తుంది.
నా సతీమణితో కలిసి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటా. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా. క్రీజులో సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఉండటం ముఖ్యం. ఏదో ఓవర్లో 15-20 పరుగులు వస్తాయని మాకు తెలుసు. నమన్ నాకు అండగా నిలిచాడు.ప్లేఆఫ్స్కి అర్హత సాధించినందుకు సంతోషంగా ఉంది. తర్వాతి మ్యాచ్లు ఇంకా బాగుంటాయి.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది.