ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను వెల్లడించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్ను వేలంలోకి వదిలేసింది. టీమ్మేనేజ్మెంట్తో ఏర్పడిన విభేదాలతోనే పంత్ వేలంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో జరిగే మెగా వేలంలో రిషభ్ పంత్ భారీ ధర పలకడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రిషభ్ పంత్ కోసం జట్లన్నీ ప్రయత్నిస్తాయని, అతని అవసరం అన్నీ జట్లకు ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతను రూ. 25-30 కోట్లు పలుకుతాడని అంచనా వేస్తున్నారు. రిషభ్ పంత్ కోసం సీఎస్కేతో పాటు ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వేలంలో పోటీపడుతాయని అభిప్రాయపడుతున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్, సీఎస్కే దిగ్గజ క్రికెటర్ సురేశ్ రైనా మాత్రం రిషభ్ పంత్.. చెన్నై సూపర్ కింగ్స్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి రిషభ్ పంత్ ఉండటాన్ని చూశానని తెలిపాడు. 'నేను ఈ మధ్యే ఢిల్లీలో మహేంద్ర సింగ్ ధోనీని కలిశాను. అక్కడే ధోనీతో పాటు రిషభ్ పంత్ ఉండటాన్ని చూశాను. ఏదో ఒక పెద్ద మార్పు జరుగబోతోందని నాకు అనిపిస్తోంది. ఎవరో ఒకరు త్వరలోనే పసుపు జెర్సీ ధరించనున్నారు'అని జియోసినిమాతో రైనా అన్నాడు.
అయితే పంత్ సీఎస్కేలోకి వెళ్తాడనే రైనా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే రైనా సీఎస్కు సుదీర్ఘ కాలం ఆడాడు. ధోనీ తర్వాత చిన్న తాలాగా గుర్తింపుపొందాడు. అతనికి ధోనీతో మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే.. ఢిల్లీలో రిషభ్ పంత్తో ధోనీ ఏం మాట్లాడాడు? అనే
విషయం మాత్రం సురేశ్ రైనా వెల్లడించలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 111 మ్యాచ్లు ఆడిన రిషభ్ పంత్ 35.31 సగటు, 148.93 స్ట్రైక్రేట్తో 3284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 18 హాఫ్ సెంచరీలున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం నలుగుర్ని రిటైన్ చేసుకుంది. టాప్ రిటెన్షన్గా అక్షర్ పటేల్ను రూ. 16.5 కోట్లకు, కుల్దీప్ యాదవ్ను రూ. 13.5 కోట్లకు, అభిషేక్ పోరెల్ను రూ. 4 కోట్లకు అట్టిపెట్టుకుంది. అనామక ప్లేయర్ అభిషేక్ పోరెల్ను రూ. 4 కోట్లకు తీసుకుంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ధోనీ వారసుడిగా పంత్ను ఎంచుకోవాలని సీఎస్కే మేనేజ్మెంట్ భావిస్తోంది.