పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్పై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. అతను చోటా కెవిన్ పీటర్సన్ అని కొనియాడాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 83 పరుగులు చేశాడు.
మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 69)తో కలిసి తొలి వికెట్కు 120 పరుగులు జోడించాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో భారీ సిక్సర్లతో చెలరేగాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ సూపర్ బ్యాటింగ్తో మ్యాచ్లో పంజాబ్ 201 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం కేకేఆర్ తొలి ఓవర్లో 7 పరుగులు చేయగానే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గకపోవడం అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు.

అధికారిక బ్రాడ్కాస్టర్ షోలో ప్రభ్సిమ్రాన్ సింగ్ గురించి మాట్లాడిన సరేశ్ రైనా అతన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో పోల్చాడు. చోటా పీటర్సన్ అని కితాబిచ్చాడు.
'ప్రభ్సిమ్రాన్ సింగ్ చోటా కెవిన్ పీటర్సన్. అతను పీటర్సన్లానే బ్యాటింగ్ చేస్తున్నాడు. స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగుతూ.. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పుతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించి ఉంటే అతను మరింత ఆనందంగా ఫీలయ్యేవాడు. పంజాబ్ ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. వారి ఫ్రాంచైజీ కోసం టైటిల్ గెలవాలనుకుంటున్నారు.'అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ రద్దవ్వడంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ రద్దవ్వడంతో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్స్ ఉండగా.. రన్ రేట్ 0.177 మెరుగ్గానే ఉంది. ఆ జట్టు ఇంకా 5 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు విజయాలు సాధిస్తే పంజాబ్ ఖాతాలో 17 పాయింట్లు చేరుతాయి.
అప్పుడు ఏ జట్టుతో సంబంధం లేకుండా పంజాబ్కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. అలా కాకుండా రెండు విజయాలు నమోదు చేస్తే మాత్రం ఇరు జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కేకేఆర్తో భారీ స్కోర్ చేసిన పంజాబ్ విజయం సాధించేలా కనిపించింది. ఈ మ్యాచ్ పూర్తిగా జరిగిన విజయం తమ ఖాతాలో చేరి ఉంటే పంజాబ్ ప్లే ఆఫ్స్ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది.