ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడినా.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉన్నతాధికారులు ఫిదా అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పేరును కూడా పరిశీలించాలని బీసీసీఐ అధికారులు చర్చించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే శ్రేయస్ అయ్యర్కు టెస్ట్ టీమ్లో కూడా చోటు దక్కుతుందని, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా అతను వ్యవహరించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్కు టీమిండియాను నడిపించే సత్తా ఉందని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ఫైనల్ చేర్చిన ఏకైక సారథి శ్రేయస్ అయ్యర్. ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు కేకేఆర్, పంజాబ్ కింగ్స్ను అయ్యర్ ఫైనల్ చేర్చాడు. కేకేఆర్కు టైటిల్ కూడా అందించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట కేకేఆర్ను అయ్యర్ వదిలేయడంతో పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కెప్టెన్గా అవకాశం ఇచ్చింది. రికీ పాంటింగ్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ దుమ్మురేపాడు. అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా సత్తా చాటాడు. ఐదుగురు అనామక ఆటగాళ్లతో పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు.

దురదృష్టవశాత్తు ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో విఫలమవ్వడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. అయినా ఆఖరి బంతి వరకు ఆ జట్టు పోరాడి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫైనల్లోనూ అయ్యర్ కెప్టెన్సీ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా జోష్లో ఉన్న ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసిన విధానం అందరికీ నచ్చింది. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై జోరుగా చర్చ సాగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో శుభ్మన్ గిల్ తేలిపోతే.. అయ్యర్కు అవకాశం దక్కనుంది.
ప్రస్తుతం భారత్.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో రోహిత్ శర్మ, టెస్ట్ల్లో శుభ్మన్ గిల్ భారత జట్టును నడిపిస్తున్నారు. వాస్తవానికి భారత్ జట్టు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్ల విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. రోహిత్ శర్మ పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో వేర్వేరు కెప్టెన్లను నియమించింది. భవిష్యత్తులో ఒక్కడే మూడు ఫార్మాట్లను నడిపించే ఛాన్స్ ఉంది. అది శ్రేయస్ అయ్యర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే అయ్యర్.. తన కెప్టెన్సీతో యువ ఆటగాళ్లను ఆకట్టుకుంటున్నాడు. ప్లేయర్ల కెప్టెన్గా ప్రశంసలు అందుకున్నాడు.