ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు జట్లలోకి కొత్త ఆటగాళ్లు వచ్చారు. సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమవ్వడంతో అతని స్థానంలో కర్ణాటక బ్యాటర్ రవచంద్రన్ స్మరన్ను తీసుకున్నారు.
మోచేతి గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ఆ జట్టు ముంబై క్రికెటర్ ఆయుష్ మాత్రేను తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఆయుష్ మాత్రే ముంబై తరఫున 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 7 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడి 962 పరుగులు చేశాడు. అతన్ని సీఎస్కే రూ. 30 లక్షల కనీస ధరకు తీసుకుంది. కర్ణాటక బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లతో పాటు 10 లిస్ట్ ఏ గేమ్స్ ఆడి 1100 పరుగులు చేశాడు. అతన్ని కూడా సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 30 లక్షలకు జట్టులోకి తీసుకుంది.
అయితే స్టార్ స్పిన్నర్ అయిన ఆడమ్ జంపా గాయం గురించి స్పష్టత లేదు. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఆ తర్వాత అతను బెంచ్కే పరిమితమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఆడమ్ జంపా స్వదేశం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో స్పిన్నర్ను తీసుకోకుండా SRH మేనేజ్మెంట్ బ్యాటర్ను ఎంచుకోవడం గమనార్హం. స్మరన్ రవిచంద్రన్కు బౌలింగ్ చేసే సామర్థ్యం కూడా ఉంది. అతని ఆఫ్ స్పిన్ వేయగలడు.