ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశపర్చింది. డిఫెండింగ్ రన్నరప్గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం సన్రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 13 పాయింట్స్ సాధించి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
గతేడాది అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్లో ఓడి టైటిల్ చేజార్చుకుంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరకుండానే వెనుదిరిగింది. 2016లో చివరిసారిగా టైటిల్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత మళ్లీ విజేతగా నిలవలేదు. 2018లో ఫైనల్ చేరినా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. అయితే గత 9 ఏళ్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ అరుదైన రికార్డ్ ఒకటి చెక్కు చెదరకుండా ఉంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ నిలిచింది.

ఐపీఎల్ 2016 సీజన్లో మూడో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఎలిమినేటర్లో కేకేఆర్ను ఓడించింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ లయన్స్ను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లో ఆర్సీబీని చిత్తు చేసి టైటిల్ అందుకుంది. ఆ తర్వాత మరే జట్టు కూడా ఎలిమినేటర్ ఆడి టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ఆ రికార్డ్ బ్రేక్ చేసేలా కనిపించినా.. క్వాలిఫయర్-2లోనే వెనుదిరిగింది.
ఈ సీజన్లో నాలుగో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్.. ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. కానీ క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో సన్రైజర్స్ రికార్డ్ చెక్కు చెదరకుండా అలానే ఉంది. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ రెండు జట్లు 18 ఏళ్ల నుంచి టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాయి. ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ కాగా.. పంజాబ్ కింగ్స్కు రెండో ఫైనల్. 2009, 2011, 2016 ఫైనల్లో ఓడిన ఆర్సీబీ.. ఈసారైనా విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. 2014 ఫైనల్లో కేకేఆర్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది.