ఐపీఎల్ 2025 సీజన్ను భారీ విజయంతో ముగించిన సన్రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల లీగ్ చరిత్రలోనే టాప్-4 హయ్యెస్ట్ టీమ్ టోటల్స్ రికార్డ్స్ను సొంతం చేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన సన్రైజర్స్ హైదరాబాద్ 278 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి ఈ ఫీట్ సాధించింది. హయ్యెస్ట్ టార్గెట్స్ సెట్ చేయాలన్నా.. ఛేదించాలన్నా తమకే సాధ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి నిరూపించింది. తమదైన రోజున బ్యాటింగ్ ఊచకోతతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తోంది.
ఐదు ఓటముల తర్వాత..
కేకేఆర్ను 110 పరుగుల తేడాతో చిత్తు చేసి కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. ఆ జట్టుపై వరుసగా ఐదు ఓటముల తర్వాత భారీ విజయంతో కేకేఆర్కు సన్రైజర్స్ హైదరాబాద్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్లో టాప్-4 హయ్యెస్ట్ టీమ్ టోటల్స్ రికార్డ్ను సొంతం చేసుకుంది. గతేడాది ఆర్సీబీతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో 287/3 ఆల్టైమ్ రికార్డ్ స్కోర్ నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 286/6 స్కోర్ నమోదు చేసింది.
తాజా మ్యాచ్లో కేకేఆర్ 278/3, గతేడాది ముంబై ఇండియన్స్పై 227/3 పరుగులు చేసింది. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఈ గెలుపుతో సన్రైజర్స్ హైదరాబాద్ మొత్తం 14 మ్యాచ్ల్లో 6 గెలిచి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో నిలిచింది.

కేకేఆర్ చెత్త రికార్డ్..
సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం ధాటికి కేకేఆర్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. 110 పరుగుల తేడాతో ఓడి ఐపీఎల్ చరిత్రలోనే పరుగుల పరంగా భారీ ఓటమిని మూటగట్టుకుంది. 2018లో ముంబై ఇండియన్స్ చేతిలో 102 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్.. తాజా మ్యాచ్లో 110 పరుగులు తేడాతో ఓడి ఆ రికార్డ్ను బ్రేక్ చేసింది. మరోవైపు పరుగుల పరంగా సన్రైజర్స్ హైదరాబాద్కు ఇది రెండో అతిపెద్ద విజయం.
క్లాసెన్ విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. హెన్రీచ్ క్లాసెన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 105 నాటౌట్) అజేయ శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 278 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/42) రెండు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. మనీష్ పాండే(37), హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జయదేవ్ ఉనాద్కత్(3/24), ఇషాన్ మలింగా(3/31), హర్ష్ దూబే(3/34) మూడేసి వికెట్లు తీసారు.