ఐపీఎల్ 2025 సీజన్ను ఘనంగా ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్.. అంతలోనే ఊహించని పరాజయాలను ఎదుర్కొంది. రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో విధ్వంసకర బ్యాటింగ్తో 286 పరుగుల రికార్డ్ స్కోర్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
తొలి మ్యాచ్లోనే రికార్డ్ స్కోర్ నమోదు చేయడం.. సన్రైజర్స్ టాపార్డర్ భీకరంగా ఉండటంతో ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీకి తిరుగులేదని అంతా అనుకున్నారు. సునాయసంగా ఫైనల్ చేరుతుందని భావించారు. 300 స్కోర్ కూడా నమోదు చేస్తుందని ఆశించారు. కానీ తర్వాతి రెండు మ్యాచ్ల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఊహించని షాక్ తగిలింది. 300 దేవుడెరుగు కనీసం 200 పరుగులు చేయలేకపోయింది.

లక్నో సూపర్ జెయింట్స్తో ఉప్పల్ వేదికగానే జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్లతో చిత్తయ్యింది. ఈ ఓటమి సన్రైజర్స్ లుకలుకలను బయటపెట్టింది. ముఖ్యంగా సన్రైజర్స్ బలమంతా టాపార్డర్లోనే ఉందనే విషయాన్ని తెలియజేసింది. బౌలింగ్ పేలవమనే విషయం ప్రత్యర్థులకు అర్థమైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లోనూ సన్రైజర్స్ తేలిపోయింది. చెత్త బ్యాటింగ్తో 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్లో టాపార్డర్ వైఫల్యంతో పాటు చెత్త బౌలింగ్ సన్రైజర్స్ కొంపముంచింది.
ఈ వరుస పరాజయాలతో సన్రైజర్స్ అసలు పరిస్థితి అభిమానులకు తెలుసొచ్చింది. మరోసారి 300 అంటే మూతి పగులుతుందనే విషయం అర్థమైంది. ఇప్పటికైనా సన్రైజర్స్.. దూకుడును పక్కనపెట్టి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. బౌలింగ్ విభాగాన్ని కూడా పటిష్టం చేసుకోవాలని, సీనియర్లు మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు.
అయితే కొందరు అభిమానులు మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నరఘోష తగిలిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. తొలి మ్యాచ్లోనే 286 పరుగులు చేయడం చూసి ఇతర జట్లు తట్టుకోలేకపోయాయని అభిప్రాయపడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో కావ్య మారన్ నరఘోష పుజలు చేయాలని కోరుతున్నారు.
అవసరమైతే తెలంగాణ స్టైల్లో ఓ యాట(మేక)ను కాటేరమ్మకు బలివ్వాలని హితవుపలుకుతున్నారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ పూజలు చేసిందని, దాంతో ఎన్నడూ లేని విధంగా ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందని గుర్తు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ట్రాష్ అని, మెరుగైన ప్రదర్శన చేస్తేనే విజయం దక్కుతుందని మరికొంతమంది అభిమానులు అంటున్నారు.