ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైనా.. బ్యాటింగ్లో తగ్గేదేలే అని సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి అన్నాడు. ఈ వరుస ఓటములకు తాము ఏ మాత్రం భయపడమని, దూకుడైన బ్యాటింగ్ అప్రోచ్ను కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. త్వరలోనే తిరిగి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఇది నాలుగో పరాజయం. రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగుల భారీ స్కోర్తో ఘన విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్లతో చిత్తయ్యింది. పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్ సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసిస్తోంది. పరిస్థితులతో సంబంధం లేకుండా సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నం చేయడం జట్టు ఓటమికి కారణమవుతుందని, కండిషన్స్కు తగ్గట్లు ఆడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరోవైపు డానియల్ వెటోరి మాత్రం వరుస ఓటములు ఎదురైనా.. తమ బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండదని చెప్పాడు. ఆదివారం మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన డానియల్ వెటోరి.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'మా బ్యాటింగ్ అప్రోచ్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ పిచ్ కండిషన్స్ను మేం బాగా రీడ్ చేయాలి. ప్రత్యర్థి బౌలర్లను గౌరవించాలి. వారి వ్యూహాలను అర్థం చేసుకునేలా ప్రణాళికలు రచించాలి. మా టాప్-3 బ్యాటర్ల కోసం ప్రణాళికలు రెడీ చేసినా.. వాటిని అమలు చేయడంలో వారు విఫలమయ్యారు. అయితే ఈ ఓటములకు నేనైనా.. ప్యాట్ కమిన్స్ అయినా అస్సలు భయపడం. మా కెరీర్లో ఎనాడు భయపడిన సందర్భాలు లేవు.
అయితే వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం సరి కాదని మాకు తెలుసు. ఈ వరుస పరాజయాలు మా లక్ష్యాలను దెబ్బతీయవచ్చు. గతేడాది రన్నరప్గా నిలిచి.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి.. అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న తర్వాత ఈ వరుస ఓటములను జీర్ణించుకోవడం కష్టం.'అని డానియల్ వెటోరి చెప్పుకొచ్చాడు.