టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐపీఎల్ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఉన్న రిషభ్ పంత్.. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంలో జట్టు మారుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు రిషభ్ పంత్.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు వెళ్తున్నాడనే పుకార్లు వెలువడ్డాయి.
రెండేళ్ల క్రితం(2022) ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్తో అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. మునపటిలా అసాధారణ ప్రదర్శన కనబర్చి టీమిండియాకు ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024లోనూ కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

అంతర్జాతీయ క్రికెటర్గా పంత్కు తిరుగు లేకున్నా.. ఐపీఎల్ 2025లో అతను జట్టు మారుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని మా వన్ ఇండియా బెంగాలి రిపోర్టర్.. ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ముందు ప్రస్తావించగా.. అతను ఖండించాడు. రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనే ఉంటాడని, అతనే కెప్టెన్గా కొనసాగుతాడని స్పష్టం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషభ్ పంత్ తప్పుకుంటున్నాడనే వార్తల్లో నిజం లేదన్నాడు. ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్న గంగూలీ.. ఈ విషయాన్ని వెల్లడించాడు. హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రికీ పాంటింగ్ తప్పుకున్నాడని కూడా చెప్పాడు. భారత్కు చెందిన మాజీ ఆటగాడే ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపడుతాడని స్పష్టం చేశాడు. అయితే ఆ మాజీ ఆటగాడు ఎవరా? అనేది మాత్రం వెల్లడించలేదు. సౌరవ్ గంగూలీనే ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.