వరుసగా వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. 200-220 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్మన్ గిల్.. డ్యూ కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
'హిట్టింగ్ చేయడానికి పిచ్ అంత సులువుగా లేదు. దాంతోనే సెట్ అయిన బ్యాటర్ చివరి వరకు ఆడాలని అనుకున్నాం. కనీసం 17-18 ఓవర్ల వరకు క్రీజులో ఉండాలనుకున్నాం. 200-220 పరుగులు చేయాలనుకున్నాం. వరుసగా వికెట్లు కోల్పోవడం మా పతనాన్ని శాసించింది. బంతి ఆగుతూ వచ్చింది. ఇది కఠినమైన పిచ్. మిడిల్ ఓవర్లలో మా స్ట్రైక్ రొటేషన్ సరిగ్గా లేదు. దీనిపై మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.

బౌలింగ్లో వికెట్లు తీయాలని భావించాం. కానీ మేం అనుకున్నట్లు జరగలేదు. మేం 2-3 వికెట్లు తీసి ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారేది. డ్యూ కూడా మా అవకాశాలను దెబ్బతీసింది. 10-11వ ఓవర్ తర్వాత డ్యూ వచ్చింది. మేం ఆశించినంత బంతి ఆగలేదు. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లింది. ఇది మాకు శుభసూచకం. వీలైనంత వరకు మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకెళ్లాలనుకున్నాం.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 56), శుభ్మన్ గిల్(38 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 60)హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్(2/34), రవి బిష్ణోయ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. దిగ్వేష్ రతి, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీసారు
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(34 బంతుల్లో ఫోర్, 7 సిక్స్లతో 61), ఎయిడెన్ మార్క్రమ్(31 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(2/26) రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, రషీద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.