ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో 112 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించగా.. అభిషేక్ పోరెల్(19 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 30) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ తలో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో 205 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శుభ్మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 93 నాటౌట్) రాణించాడు. ఇద్దరే లక్ష్యాన్ని చేధించడం గమనార్హం. ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. ఒక్క వికెట్ తీయలేకపోయారు.
200 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. పవర్ ప్లేలోనే 59 పరుగులు చేసిన ఈజోడీ.. 10.4 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ను అందుకుంది. 30 బంతుల్లో సాయి సుదర్శన్.. 33 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీలు అందుకున్నారు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించిన ఈ జోడీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చెడుగుడు ఆడింది.
వేగంగా ఆడిన సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీపూర్తి చేసుకున్నాడు. శుభ్మన్ గిల్ సైతం సెంచరీ దిశగా సాగాడు. కానీ లక్ష్యం తక్కువగా ఉండటంతో గిల్ సెంచరీ సాధ్యం కాలేదు. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో సాయి సుదర్శన్ సిక్సర్తో గుజరాత్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో గుజరాత్ 6 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నికైవసం చేసుకుంది.