ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సహనం కోల్పోయాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బడుతూ.. ఫోర్త్ అంపైర్పై అసహనం వ్యక్తం చేశాడు. కళ్లు దొబ్బాయా? అని సైగలతో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔటయ్యాననే కోపంలో ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అసలేం జరిగిదంటే..?
జీషన్ అన్సారీ వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతికి శుభ్మన్ గిల్ రనౌటయ్యాడు. అన్సారీ వేసిన గూగ్లీ లెంగ్త్ను జోస్ బట్లర్.. షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడి క్విక్ సింగిల్కు ప్రయత్నం చేశాడు. బంతిని అందుకున్న హర్షల్ పటేల్.. వికెట్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్కు అందించాడు. అతను బంతిని అందుకొని వికెట్లను గీరాటేయకుండా.. బంతిని గ్లోవ్స్తో స్టంప్స్ వైపుకు నెట్టేసాడు. నాన్స్ట్రైకర్ శుభ్మన్ గిల్ తన బ్యాట్ను క్రీజులో పెట్టలేకపోయాడు. దాంతో సన్రైజర్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. లెగ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు.
పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అయితే బంతి కన్నా ముందే వికెట్లను క్లాసెన్ గ్లోవ్స్ తాకినట్లు కనిపించింది. మరో యాంగిల్లో బంతి నేరుగా వికెట్లు తాకినట్లు కనిపించడం.. క్రీజులో శుభ్మన్ గిల్ బ్యాట్ పెట్టకపోవడంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్గా వెల్లడించాడు. ఈ నిర్ణయంపై శుభ్మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. డగౌట్లో ఉన్న ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. కళ్లు కనబడటం లేదా అని తన చేతులతో సైగలు చేస్తూ నోరు పారేసుకున్నాడు.

గుజరాత్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 76), జోస్ బట్లర్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సాయి సుదర్శన్(23 బంతుల్లో 9 ఫోర్లతో 48) తన ఫామ్ను కొనసాగించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/35) మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ తలో వికెట్ తీసారు. కీలక క్యాచ్లను వదిలేయడంతో పాటు చెత్త ఫీల్డింగ్తో సన్రైజర్స్ హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది.
అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ(41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 74) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్(2/33) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టారు. సన్రైజర్స్ హైదరాబాద్ చెత్త ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకుంటే.. గుజరాత్ టైటాన్స్ మాత్రం స్టన్నింగ్ ఫీల్డింగ్తో విజయాన్నందుకుంది.