బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో పంజాబ్ తమ టాప్-2 ప్లేస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. మార్కస్ స్టోయినీస్(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 44 నాటౌట్), జోష్ ఇంగ్లీస్(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32) దూకుడుగా ఆడారు.
ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/33) మూడు వికెట్లు తీయగా.. విప్రజ్ నిగమ్(2/38), కుల్దీప్ యాదవ్(2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ముఖేష్ కుమార్కు ఓ వికెట్ దక్కింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 58 నాటౌట్), కరుణ్ నాయర్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 44) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్(2/41) రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ప్రవీన్దూబే చెరో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. పిచ్కు తగ్గట్లు బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని తెలిపాడు.'ఈ పిచ్పై 207 అద్భుతమైన స్కోర్. ఈ వికెట్పై వేరియేబుల్ బౌన్స్ ఉంది. అంతేకాకుండా బంతి వేగంలో వ్యత్యాసం ఉంది. మేం క్రమశిక్షణతో బౌలింగ్ చేయలేదు. మేం ఈ పిచ్కు తగ్గట్లు స్టంప్స్ లైన్లో హార్డ్ లెంగ్త్లో బంతిని హిట్ చేయాలనుకున్నాం. కానీ వికెట్లు తీయాలనే ప్రయత్నంలో ఎక్కువ బౌన్సర్లు వేసాం.
ఈ టోర్నీలో ప్రతీ జట్టు బలంగానే ఉంటుంది. సానుకూలంగా, ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మేం పటిష్టమైన ప్రణాళికలతో తదుపరి మ్యాచ్లో బరిలోకి దిగుతాం. నాకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు. కేవలం వేలికి చిన్నగాయమైంది. తదుపరి మ్యాచ్కు నయమవుతోంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.