బౌలింగ్లో అదనంగా 20 పరుగులు ఇవ్వడమే తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన పంజాబ్ కింగ్స్ 50 పరుగులు తేడాతో చిత్తయ్యింది. ఈ సీజన్లో వరుసగా రెండు విజయాలతో జోరు కనబర్చిన పంజాబ్ కింగ్స్కు ఇదే తొలి పరాజయం. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఈ మ్యాచ్లో ఓడినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. టోర్నీ ఆరంభంలోనే ఎదురైన ఈ ఓటమితో తమ తప్పిదాలు ఏంటో తెలుస్తాయని అభిప్రాయపడ్డాడు.
'నిజం చెబుతున్నా.. ఈ వికెట్పై 180-185 పరుగుల లక్ష్యమే ఎక్కువ. ఈ లక్ష్యాన్ని అయితే చేధించగలం. కానీ మేం అదనంగా 20 పరుగులు సమర్పించుకున్నాం. మా ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. టోర్నీ ఆరంభంలోనే ఈ ఓటమి ఎదురైనందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది చాలా మంచి పిచ్. బంతి కొంచెం ఆగి వస్తుంది. మేం రాజస్థాన్ బ్యాటర్లకు ఎక్కువ పేస్ ఇవ్వలేదు. భాగస్వామ్యాలతో ఈ లక్ష్యాన్ని చేధించవచ్చని భావించాను. కానీ ఈ ఓటమి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

ఈ రోజు మేం ఊహించనట్లుగానే డ్యూ రాలేదు. మేం ఈ మ్యాచ్లో చేసిన తప్పిదాలపై ఫోకస్ పెడ్తాం. బౌలింగ్, బ్యాటింగ్ వీడియోలు పరిశీలించి ఎక్కడ తప్పిదం చేశామో గుర్తిస్తాం. వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. వికెట్లు పడిన తర్వాత వచ్చి బ్యాటింగ్ చేయడం కష్టం. ఎందుకంటే కొత్త బ్యాటర్లు భారీ షాట్లు ఆడటం అంత సులువు కాదు. ఒత్తిడిలోనూ నేహాల్ వధేరా అద్భుతంగా ఆడాడు.
క్రీజులో సెట్ అయ్యేందుకు అతను కొంత సమయం తీసుకున్నా.. ఆ తర్వాత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. టోర్నీ ఆరంభంలో ఎదురైన ఈ పరాజయం మమ్మల్ని మేల్కోల్పింది. మా తప్పిదాలను తెలుసుకునేలా చేసిన ఈ ఓటమి మా మంచికేనని భావిస్తున్నాను.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు పరుగులే చేసి ఓటమిపాలైంది. నెహాల్ వధేరా(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 62), గ్లేన్ మ్యాక్స్వెల్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు.