ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. 12 ఏళ్ల తర్వాత ధర్మశాలో పంజాబ్ విజయం సాధించింది. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్లో తమకు అదృష్టం కలిసొచ్చిందన్న అయ్యర్.. అది ఊరికే రాదని చెప్పాడు. కష్టపడితేనే లక్ కూడా కలిసొస్తుందని తెలిపాడు.
'నిజం చెప్పాలంటే.. జట్టులోని అందరూ ఆటగాళ్లు సరైన సమయంలో సత్తా చాటారు. ప్రతీ ఒక్కరు జట్టు విజయం కోసం అపారమైన కృషి చేశారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతని బ్యాటింగ్ కనుల విందుగా ఉంది. ధర్మశాల రికార్డ్ గురించి నాకు తెలియకపోవడం మంచిదైంది. మ్యాచ్ గెలవాలనే మైండ్సెట్తో మైదానంలోకి అడుగుపెట్టాను. గణంకాల గురించి ఆలోచించడం లేదు. ఎంత స్కోర్ అయితే డిఫెండ్ చేసుకోగలమనే రికార్డ్స్ను పట్టించుకోలేదు.

మేం అదృష్టవంతులం. కానీ కష్టపడటం వలే అది వచ్చింది. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి బాధ్యతల గురించి తెలుసు. వారు తమ బాధ్యతల నిర్వర్తించే విధానం అద్భుతం. మేం మెరుగుపరుచుకోవాల్సిన ఏకైక విషయం మ్యాచ్పై అవగాహన పెంచుకోవడం. ఎవరి బలలాను వారు నమ్ముకొని ఆడాలి. అది జట్టుకు ఉపయోగపడుతుంది. గణంకాలు, రికార్డ్స్ గురించి ఆలోచించవద్దు. మ్యాచ్ గెలవడమే అన్నిటి కన్నా ముఖ్యం.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆయుష్ బదోని(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 74), అబ్దుల్ సమద్(24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45) పోరాడినా ఫలితం లేకపోయింది. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీసాడు.