సరైన కమ్యూనికేషన్ లేకనే కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) వీడాల్సి వచ్చిందని ఆ జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా వెటరన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్ల రికార్డ్ ధర పలికిన విషయం తెలిసిందే. రిషభ్ పంత్(రూ. 27 కోట్లు) తర్వాత అత్యధిక మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ పడి మరీ పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల భారీ ధరకు శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసింది. తమ జట్టు సారథిగా నియమించింది. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే కేకేఆర్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ రిటెన్షన్ ప్రక్రియలో కేకేఆర్ అయ్యర్ను పక్కనపెట్టింది. దాంతో ఆ జట్టును వీడిన శ్రేయస్ అయ్యర్ వేలంలో భారీ ధరను సొంతం చేసుకున్నాడు.

టైటిల్ గెలవడం అద్భుతం..
సాధారణంగా టైటిల్ అందించిన సారథిని ఎవరూ వదులుకోరు. కానీ కేకేఆర్ వదిలేయడంపై తాజాగా శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. 'కేకేఆర్ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలవడం సంతోషంగా అనిపించింది. కేకేఆర్కు విపరీతమైన ఫ్యాన్స్ మద్దతు ఉంటుంది. ప్రతీ మ్యాచ్కు స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయేది. ఆ జట్టులో గడిపిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను.
ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత కేకేఆర్ మేనేజ్మెంట్తో చాలా సార్లు మాట్లాడాను. కానీ, ఎప్పుడూ రిటెన్షన్ గురించి చర్చించలేదు. చివరి వరకు కేకేఆర్ సరైన సమాచారం ఇవ్వలేదు. దాంతో కాస్త గందరగోళానికి గురయ్యాను. సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతోనే జట్టును వీడాల్సి వచ్చింది. అయితే పరస్పర అంగీకరంతోనే ఇది జరిగిందని బలంగా నమ్ముతాను.
బాత్రూమ్లో కూర్చున్న..
రిటెన్షన్కు వారం ముందే జట్టు ప్రణాళికలు తెలిసాయి. దాంతో నేను నా నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత ఏం జరిగినా ఫర్వాలేదని ముందుకు సాగాను. మెగా వేలం జరుగుతున్నప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. దేశవాళీ మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లాను. మంచి ధర పలుకుతానని అనుకున్నా. కానీ ఇంత భారీ మొత్తంలో వస్తుందని అస్సలు ఊహించలేదు.
వేలంలో రెండు జట్లు నా కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. అది నాకెంతో థ్రిల్లింగ్గా అనిపించింది. కాసేపటికి రూమ్ డోర్ మూసేసి.. బాత్రూమ్కు వెళ్లిపోయా. బయట ఏం మాట్లాడుకుంటున్నారనేది వినకూడదనే అలా చేశాను.'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.