ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో తాను బాల్ బాయ్గా వ్యవహరించానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2008 సీజన్లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య జరిగిన మ్యాచ్ను బాల్ బాయ్గా దగ్గరుండి చూశానని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగినరాస్ టేలర్తో మాట్లాడానని తెలిపాడు.
'నేను గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగాను. ముంబై అండర్ 14కు ఆడుతున్న సమయంలో మా జట్టులోని అందరికి బాల్ బాయ్స్గా బాధ్యతలు అప్పగించారు. అదే నాకు ఐపీఎల్లో తొలి ఎంట్రీ. ఆ సమయంలో నేను కాస్త భయపడ్డాను. అప్పుడు నా స్నేహితులంతా ఆటగాళ్ల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నేను కూడా వారిని అనుసరించాను. అప్పట్లో రాస్ టేలర్ అంటే నాకు చాలా ఇష్టం. అతని దగ్గరకు వెళ్లి నేను మీ అభిమానినని చెప్పాను. అతను నాతో మాట్లాడాడు. నాకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. అప్పట్లో ఆటగాళ్లు బ్యాట్ లేదా గ్లౌజ్లు ఇచ్చేవారు. నాకు కూడా వాటిని అడగాలని ఉన్నా..సిగ్గుతో అడగలేదు.

అదే మ్యాచ్లో ఇర్ఫాన్ పఠాన్తో మాట్లాడే అవకాశం దక్కింది. లాంగాన్లో ఫీల్డింగ్ చేస్తున్న అతను మా పక్కన కూర్చొని మాట్లాడాడు. మ్యాచ్ను ఆస్వాదిస్తున్నారా? అని అడిగాడు. మేం చాలా ఎంజాయ్ చేస్తున్నామని, అతన్ని చూసి థ్రిల్ అవుతున్నామని చెప్పాం. ఆ సమయంలో ఇర్ఫాన్ పఠాన్కు చాలా క్రేజ్ ఉండేది. అప్పుడు పంజాబ్ జట్టులో యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. ఇది జరిగి చాలా ఏళ్లు అవుతున్నా నాకు ఇంకా గుర్తుంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
2015లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్.. ఇప్పటి వరకు 32.33 సగటుతో 3127 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలుఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్కు ఆడిన అతను.. తాజా సీజన్లో పంజాబ్ కింగ్స్ను నడిపించబోతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కెప్టెన్గా కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఐపీఎల్ 2025 సీజన్కు మార్చి 22న తెరలేవనుండగా.. మార్చి 25న గుజరాత్ టైటాన్స్తో జరిగే తొలి మ్యాచ్తో పంజాబ్ కింగ్స్ టైటిల్ వేటను ప్రారంభించనుంది.