పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వల్లే తమ జట్టు క్వాలిఫయర్-1కు అర్హత సాధించిందని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కెప్టెన్గా పాంటింగ్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని, తెరవెనుక ఉండి తనను నడిపించాడని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ను 7 వికెట్లతో చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. రికీ పాంటింగ్తో పాటు తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.
తొలి మ్యాచ్ నుంచే..
'జట్టులోని ప్రతి ఒక్కరూ సరైన సమయంలో పుంజుకున్నారు. తొలి మ్యాచ్ నుంచే పరిస్థితులు ఎలా ఉన్నా గెలవాలనే కసితో ఆడాం. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నారు. సపోర్ట్ స్టాఫ్తో పాటు మేనేజ్మెంట్కు అభినందనలు. ఆటగాళ్లను రికీ పాంటింగ్ అద్భుతంగా చూసుకున్నాడు. ఆరంభంలోనే విజయాలు దక్కడంతో ఆటగాళ్లపై నమ్మకం ఏర్పడింది. జట్టులోని ప్రతీ ఆటగాడితో మాట్లాడాను. కెప్టెన్గా ఆటగాళ్లతో మంచి సంబంధం ఉండాలి. డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉంది. ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లతో మేం విజయాలు సాధించాం. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య అద్భుతమైన ఆరంభాలు అందించాడు.

పాంటింగ్ నడిపించాడు..
కుర్రాళ్లంతా ఫియర్లెస్గా ఉన్నారు. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తారు. ఆ సన్నాహకాల ఫలితం ఇప్పుడు మైదానంలో కనబడుతోంది. ఇంగ్లిస్ మాత్రమే స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ లేదు. అతను కొత్త బంతిని ఆడటానికి ఇష్టపడుతాడు. అతను మరిన్ని కొత్త బాల్స్ ఆడాలని భావించే నా కంటే ముందు బ్యాటింగ్ పంపించాం. ఈ ప్రయోగం ఫలించింది. అతను విధ్వంసకరమైన ఆటగాడని, మంచి ఇంటెట్తో ఆడగలిగే బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మాకు తెలుసు. గత కొన్నేళ్లుగా రికీ పాంటింగ్తో నాకు స్నేహం ఉంది. అతను నాకు చాలా స్వేచ్ఛను ఇస్తాడు. బయటి నుంచి వ్యూహాలు అమలు చేయాలని నేను రికీకి చెబుతాను. అతను చెప్పిన చిట్కాలను మైదానంలో అమలు చేస్తాను.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రియాన్ష్ ఆర్య(35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 62), జోష్ ఇంగ్లీస్(42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 73) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిచెల్ సాంట్నర్(2/41) రెండు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.