పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు జట్లను ప్లే ఆఫ్స్ చేర్చిన తొలి కెప్టెన్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 17 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. నెహాల్ వధేరా(37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే(2/37) రెండు వికెట్లు తీయగా.. క్వెనా మఫకా, రియాన్ పరాగ్, ఆకాశ్ మధ్వాల్ తలో వికెట్ తీసారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులే చేసింది. యశస్వి జైస్వాల్(25 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 50), ధ్రువ్ జురెల్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 53) వైభవ్ సూర్యవంశీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 40)రాణించినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్(3/22) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఈ గెలుపుతో పాటు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలవ్వడంతో పంజాబ్ కింగ్స్కు కలిసొచ్చింది. ఢిల్లీ ఓటమితో పంజాబ్ కింగ్స్తో పాటు ఆర్సీబీ, గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఒక్క ప్లేస్ కోసం ముంబై, ఢిల్లీ, లక్నో పోటీపడుతున్నాయి. గతేడాది కేకేఆర్ను నడిపించిన శ్రేయస్ అయ్యర్.. టైటిల్ కూడా అందించాడు.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కు సారథ్యం వహించిన అతను ఆ జట్టును ప్లే ఆఫ్స్కు తీసుకెళ్లాడు. తాజాగా పంజాబ్ కింగ్స్ను కూడా ప్లే ఆఫ్స్ తీసుకెళ్లడంతో మూడు జట్లను ప్లే ఆఫ్స్ చేర్చిన కెప్టెన్గా చరిత్రకెక్కాడు. మరే కెప్టెన్ ఈ ఫీట్ సాధించలేదు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరింది.